కొలువుదీరిన వామ్
సాక్షి, చైన్నె: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల వామ్ బజార్ చైన్నెలో కొలువు దీరింది. ప్రత్యేక రాయితీలతో బంగారు, వెండి, రాగి, ఆభరణాలు, నాణేలు, వివిధ డిజైన్ వస్త్రాలు, వస్తువులతో కొలువైన ఈ బజార్ను ఆదివారం వామ్ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ ప్రారంభించారు. రిపబ్లిక్ డే సెలవుల సందర్భంగా వ్యా పార రంగంలో రాణిస్తున్న ఆర్యవైశ్య వ్యాపారులందరితో చిరు వర్తకులతో పరిచయాలు కల్పించే ఉద్దేశంతో ఈ వామ్ బజార్ను చూళై మేడులోని వామ్ కార్యాలయంలో ఏర్పాటు చేశామని ఈసందర్భంగా తంగుటూరి రామకృష్ణ తెలిపారు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ బజార్లో 40 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఒకగ్రాము నుండి 12 గ్రాముల వరకు 22 క్యారెట్ల గోల్డ్ ఆర్టికల్స్, సిల్వర్ ఐటమ్స్, 100 గ్రాముల సిల్వర్ మెటల్స్లు ప్రదర్శనలో ఉంచామన్నారు. రెడీమెడ్, చేనేత వస్త్రాలు, ప్యాషన్ దుస్తులు, ఆటబొమ్మలు, ఆర్టిఫిషయల్ జూవెలరీ, ఆంధ్రా పచ్చళ్లు, ఫుడ్ అండ్ ఫన్ కోర్టులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితర వాటిని కూడా ఇక్కడ కొలువు దీర్చామన్నారు. వ్యాపార సంస్థల సహకారంతో తమ కార్యాలయ ప్రాంగణంలో 3వ సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ ప్రయత్నంకు మంచి స్పందన వచ్చిందన్నారు. ఆది, సోమవారాలు ప్రతిగంటకూ లక్కీడిప్ తీసి సందర్శకులను ఎంపిక చేసి బహుమతులు అందిస్తున్నామన్నారు. ఇకపై ప్రతినెలా ఆదివారం వామ్ బజార్ ఏర్పాటు చేసి అదనంగా కూరగాయలు, పండ్లు, ఆర్గానిక్ వస్తువులను అందించనున్నామన్నారు. టీయారా జూవెలర్స్ సహకారంతో తమ కార్యాలయంలో సంవత్సరమంతా 100 గ్రాము సిల్వర్ గొలుసుల హోల్సేల్ ధరలకు లభించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే సదరన్ ట్రావెల్స్ తరపున బహుమతులు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వామ్ గ్లోబల్ అడ్వైజర్ తాడేపల్లి రాజశేఖర్, సీనియర్ సిటీజన్స్ ఫోరమ్ చైర్మన్ వూరా బాబురావు, డాక్టర్ ఎంవీ నారాయణగుప్తా, యూత్ ఫోరమ్ కో–ఆర్డినేటర్ కేకే త్రినాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


