కాంగ్రెస్లో వర్గ విభేదాలు లేవు
తిరువళ్లూరు: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవని, రానున్న ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి కూటమి విజయానికి కృషిచేస్తామని కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ అన్నారు. తిరువళ్లూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా శశికుమార్ ఎంపికై న విషయం తెలిసిందే. అయితే శశికుమార్ ఎంపికపై మాజీ అధ్యక్షుడు పొన్నేరి ఎమ్మెల్యే దురై చంద్రశేఖర్తో పాటు ఆయన మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు శశికుమార్ను పార్టీ నేతలకు పరిచయం చేసే కార్యక్రమం తిరువళ్లూరులో జరిగింది. ఎంపీ శశికాంత్ సెంథిల్ హాజరై ప్రసంగించారు. పార్టీలో గ్రూపు తగాదాలు లేవని, రానున్న ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు సదాశివలింగం, ఎగాటూరు ఆనందన్, హిమయాకక్కన్, రాష్ట్ర కార్యదర్శులు గోవిందరాజ, సంపత్, పొన్నేరి ఎమ్మేల్యే దురైచంద్రశేఖర్, మాజీ డీసీసీ అధ్యక్షుడు ఏజీ చిదంబరం, మైనారిటీ జిల్లా విభాగం అధ్యక్షుడు ఖలీల్రెహ్మాన్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్, న్యాయవాద విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హిమాలయ అరుణ్ప్రసాధ్, ఓబీసీ విభాగం వర్కింగ్ కమిటీ అద్యక్షుడు వెంకటేషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామన్ పాల్గొన్నారు.


