విజయవంతంగా వైట్ వారియర్స్ మారథాన్
సాక్షి, చైన్నె: తిరుపూర్ వేదికగా రామ్ రాజ్ వైట్ వారియర్స్ మారథాన్ 2026 ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. రామరాజ్ కాటన్ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఈ మారథాన్ను నిర్వహించారు. 2 వేల మందికి పైగా రన్నర్లు దూసుకెళ్లారు. ఉద్యోగుల శ్రేయస్సు, ఆరోగ్య సంరక్షణ, శారీరక దృఢత్వం, బలమైన కుటుంబ సంబంధాలను ప్రోత్సహించే విధంగా జరిగిన ఈ మారథాన్ను తిరుపూర్ నల్లూరు రేంజ్ డీఎస్పీ థైయల్ నాయకీ జెండా ఊపి ప్రారంభించారు. వంజి పాళయం రోడ్డులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఉద్యోగులు, వారి పిల్లలు ఉత్సాహంగా 5 కి.మీ, 8 కి.మీ, తదితర రన్లలో దూసుకెళ్లారు. ఈ సందర్భంగా రామ్ రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు కేఆర్ నాగరాజన్ మాట్లాడుతూ, రామ్రాజ్ వైట్ వారియర్స్ మారథాన్ కేవలం ఒక రేస్ కాదు అని, ఇది క్రమ శిక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఒక సమాజంగా అందర్నీ కలిపే కార్యక్రమంగా వివరించారు. తమ ఉద్యోగులు, వారి కుటుంబాల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నామన్నారు. వివిధ కేటగిరీల వారీగా జరిగిన ఈ రన్లో మొదటి, రెండవ, మూడవ బహుమతులను విజేతలకు అందజేశారు. అలాగే, అందరికీ పతకాలు, డిజిటల్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.


