డీఎంకేలో సీట్ల చర్చ
సాక్షి, చైన్నె : డీఎంకేలో సీట్ల పందేరం చర్చ మొదలైనట్టుగా కూటమి పార్టీల నేతలు అన్నా అరివాలయం వైపుగా క్యూ కట్టే పనిలో పడ్డారు. మంగళవారం ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత షణ్ముగం వేర్వేరుగా స్టాలిన్తో సమావేశమయ్యారు. ఏఐసీసీ ఆదేశాలతో టీఎన్సీసీ నేతృత్వంలో కాంగ్రెస్ కమిటీ ఇటీవల సీఎం,డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో సమావేశమైన విషయం తెలిసిందే. తమకు కావాల్సిన సీట్ల సంఖ్య, నియోజకవర్గాల జాబితాను ఆ కమిటీ అందజేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ పార్టీ 70 సీట్లు ఆశిస్తున్నట్టుగా సమాచారాలు వెలువడగా, తాజాగా 40లోపు సీట్లకు సర్దుకునేందుకు సిద్ధమవుతున్నట్టు చర్చ జరుగుతుంది. గత ఎన్నికలలో 25 సీట్లు ఇవ్వగా18 చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో ఈ సారి సీట్లను డీఎంకే మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ భేటీ తదుపరి సీపీఐ నేత వీర పాండియన్ నేతృత్వంలో బృందం స్టాలిన్తో సమావేశమయ్యారు. తాజాగా మంగళవారం ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత షణ్ముగం భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీశాయి. వీరంతా వేర్వేరుగా సమావేశమైనా అసెంబ్లీ ఎన్నికల సీట్ల చర్చలు మొదలెట్టినట్టుగా చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఈ సారి మిత్ర పక్షాలకు తక్కువ సీట్లు ఇచ్చి, అధిక స్థానాలలో పోటీచేసే దిశగా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. ఇందుకు బ్రహ్మాస్త్రంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా మోగబోతున్న రాజ్యసభ నగారాను పరిగణించి ఉన్నారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలకు చెందిన జాతీయ స్థాయి ముఖ్య నేతలతో పాటూ ఎండీఎంకే నేత వైగో సైతం రాజ్యసభను ఆశిస్తున్నట్టు సమాచారం. ఖాళీ కానున్న ఆరు స్థానాలలోనాలుగు స్థానాలు తమ చేతిలో ఉన్న దృష్ట్యా, జాతీయ పార్టీలకు రాజ్యసభను అప్పగించి తమిళనాట అసెంబ్లీ స్థానాల సంఖ్యలో కోత పెట్టే దిశగా స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టినట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉండగా, మంగళవారం సోదరా కదిలిరా నినాదం మేరకు ఆంబూరు, వాణియం బాడి నియోజక వర్గాల నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. మాదిరి ఓటరు జాబితా విడుదల కాగానే, ఎవ్వరెవ్వరి పేర్లు తొలగించబడ్డాయో గుర్తించి, మళ్లీ చేర్పించే ప్రయత్నాలు చేపట్టాలని ఆదేశించారు. స్టాలిన్తో భేటీ అనంతరం వైగో స్పందిస్తూ, మళ్లీ అధికారం డీఎంకేకు తథ్యం అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
డీఎంకేలో సీట్ల చర్చ


