సమ సమాజ స్థాపనే లక్ష్యం
న్యూస్రీల్
జీవన ప్రమాణాలు పెరగాలి సామాజిక హోదా తప్పనిసరి సీఎం స్టాలిన్ మోడకురిచ్చిలో పోలన్ విగ్రహం ఆవిష్కరణ
అందరూ సమానంగా జీవించే సమాజాన్ని సృష్టించాలని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. వెనుకబడిన, అణగారిన, అణచివేతకు గురైన ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, సామాజిక హోదాను సాధించాలని, అందుకే ద్రావిడ మోడల్ ప్రభుత్వం విస్తృతంగా పథకాలను అమలు చేస్తున్నట్టు వివరించారు.
సాక్షి, చైన్నె : ఈరోడ్ జిల్లా మోడకురిచ్చిలో రూ. 4.90 కోట్లతో స్వాతంత్య్ర సమరయోధుడు పోలన్ విగ్రహం, స్మారక మందిరాన్ని తమిళాభివృద్ధి , సమాచార శాఖ నేతృత్వంలో నిర్మించారు. స్వాతంత్య్రసమరయోధుడు ధీరన్ చిన్నమలైకు అత్యంత విశ్వసనీయ సహచరుడిగా స్వాతంత్య్ర సంగ్రామంలో మహావీరుడు పోలన్ తెల్ల దొరలను మట్టి కరిపించడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన స్మారకంగా అశ్వంపై అధిరోహించినట్టుగా నిలువెత్తు విగ్రహం, స్మారక మందిరం మోడకురిచ్చి తాలూకా వడుగపట్టి గ్రామం జయరాంపురంలో రూ.4.90 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినానంతరం సీఎం స్టాలిన్ పోలన్కు నివాళులర్పించారు. పోలన్ వారసులు వరదరాజన్, మురుగన్, వీరన్, పళనిస్వామి, రాజన్లను ఈసందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆది తమిళర్ పేరవై , తమిళ టైగర్స్ , తమిళనాడు అరుందతీయ యూత్ ఫ్రంట్, ఫ్రీడమ్ ఫైటర్స్ , అరుంధతీయ రచయితలు, సోషల్ లిబరేషన్ కొంగునాడు అరుందతియార్ లిబరేషన్ ఫ్రంట్, ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ , తమిళనాడు అరుందతియార్ సంఘం, మదురై వీరన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్, తమిళ సామాజిక న్యాయ సంఘం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, సోషల్ లిబరేషన్ , తమిళ వర్కర్స్ , రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు , కొంగు లిబరేషన్ టైగర్స్ , అరుందతీయర్ పీపుల్స్ ప్రోగ్రెస్ , అరుందతీయర్ పీపుల్స్ కౌన్సిల్ తదితర సంఘాలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించారు.
ఎందరో వీరులు..
సీఎం స్టాలిన్ ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, పోలన్ విగ్రహం, అద్భుత మణి మండపం ఇక్కడ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. పులిదేవన్, వీర పాండియకట్టబొమ్మన్, దీరన్ చిన్నమలై, మరుదు వీరర్, వీర మంగై వేలు నాచ్చియార్ గురించి గుర్తు చేస్తూ, వీరంతా తమిళ నేలలో పుట్టి ఈ భూమి కోసం, భాష కోసం పోరాడిన ధైర్యమైన స్వాతంత్య్ర వీరులు అని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఈ నేల కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని స్మరిస్తూ విగ్రహాలు, మణి మండపాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నామని వివరించారు. అరుంధతీయులకు రిజర్వేషన్ కేటాయింపుతో వారిలో విద్యాపరంగా అభ్యున్నతి పెరిగిందన్నారు. 2009లో 193 మంది అరుంధతీయ విద్యార్థులు ఇంజినీరింగ్ చదువుకున్నారని గుర్తు చేస్తూ, తాజాగా ఆ సంఖ్య 3,944కు చేరిందన్నారు. 2023–24లో 193 మంది విద్యార్థులు ఎంబీబీఎస్కి ఎంపికై విద్యలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. అరుంధతీయుల అభ్యున్నతిని కాంక్షిస్తూ కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, నామక్కల్, ధర్మపురి, తేని, కరూర్ జిల్లాల్లోని పాఠశాల , కళాశాలలు, వసతి సౌకర్యాలు, విజ్ఞాన కేంద్రాలను గుర్తు చేశారు.ఇవన్నీ చేస్తూ, అందరికీ అన్నీ అందుబాటులో ఉండాలని, అందరూ సమానంగా జీవించే సమాజాన్ని మనం సృష్టించాలని, సమ్మిళిత అభివృద్ధి నిజమైన ప్రగతి అని ఆకాంక్షించారు. రానున్న ద్రవిడ మోడల్ 2.ఓ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు ముందడుగు వేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
పళణి పెద్ద ద్రోహి
ప్రతి పక్ష నాయకుడు పళణి స్వామి తానో రైతు అని చెప్పకుంటూనే రైతాంగానికి తీవ్రద్రోహం తలబెడుతూ వస్తున్నట్టు ఆరోపించారు. ఆయన రైతు కాదు, ఒక దేశ ద్రోహి, ఇంకా చెప్పాలంటే రాజద్రోహం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. ఆయన్న రైతు అని పిలవాల్సి వస్తే, అది నిజమైన రైతులకు అవమానం అని వ్యాఖ్యలు చేశారు. వరిలో తేమ సడలింపునకు కేంద్రాన్ని తాము అభ్యర్థిస్తూ వస్తున్నామని, అయితే, ఆ కూటమిలో ఉన్న పళణి స్వామి ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడం లేని ప్రశ్నించారు. కోయంబత్తూరు , మదురైలలో మెట్రో రైలు ప్రాజెక్టులకు అన్యాయం తలబెడుతుంటే, కేంద్రాన్ని ఆయన వెనకేసుకు రావడం ద్రోహం కాదా అని ప్రశ్నించారు. తమిళనాడు పథకాలకు కేంద్రంలోని బీజేపీ అనుమతి ఇవ్వడం లేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మెట్రో ప్రాజెక్టులు, రైతు ప్రయోజనార్థం అనుమతులను ఢిల్లీ వెళ్లైనా సాధించుకుని రావాలని హితవు పలికారు. తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు గవర్నర్ సైతం గత రెండు రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రావడం శోచనీయమన్నారు. తీవ్రవాద ప్రబల్యం ఉన్న రాష్ట్రంగా తమిళనాడును గవర్నర్ సూచిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీకి ఓటు వేయని వారందరూ ఉగ్రవాదులే అన్నట్టుగా గవర్నర్ తీరు ఉందని, బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పళనిస్వామి వంటి నమ్మకద్రోహికి గుణపాఠం చెప్పాలని, తమిళనాడు అభివృద్ధి ప్రయాణానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ద్రావిడ మోడల్ 2. ఓ ప్రభుత్వం కొనసాగుతుందని , ఇందుకు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు.కాగా, ముందుగా సీఎం స్టాలిన్కు దారి పొడవున డీఎంకే వర్గాలు , ప్రజలు బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానం పలికారు. అక్కడక్కడ తన కాన్వాయ్ నుంచి దిగి ప్రజలను పలకరిస్తూ సీఎం ముందుకు సాగారు.
ప్రజలతో మాట్లాడుతున్న సీఎం స్టాలిన్
పోలన్ వారసులకు సత్కారం
మహిళలకు ఆటోల పంపిణీ
అభివృద్ధి పనులు
మోడకురిచ్చి పర్యటనను ముగించుకుని ఈరోడ్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం హాజరు అయ్యారు. రూ. 235 కోట్లతో పూరైన పనులు ప్రారంభించారు. రూ.91 కోట్లతో కొత్తగా చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 605 కోట్లు విలువగల సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందజేశారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ తాజాగా ఆరు కొత్త వాగ్దానాలు ప్రకటించారు.
సమ సమాజ స్థాపనే లక్ష్యం
సమ సమాజ స్థాపనే లక్ష్యం
సమ సమాజ స్థాపనే లక్ష్యం
సమ సమాజ స్థాపనే లక్ష్యం
సమ సమాజ స్థాపనే లక్ష్యం


