రామేశ్వరంలో కుండపోత
సాక్షి, చైన్నె: రామేశ్వరంలో మంగళవారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. చైన్నెలో 30వ తేదీ రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో నెలకొని ఉన్న రెండు ద్రోణుల రూపంలో కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, విరుదునగర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తామరభరణి నదిలో వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఆ తీర గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ వర్షాలు ఇంకా కొనసాగతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రామనాథపురం జిల్లా రామేశ్వరం, మండపం పరిసరాలలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా రామేశ్వరంలో 8సె.మీ, మండపంలో 6సె.మీ వర్షపాతం నమోదైంది. రామనాథస్వామి ఆలయం పరిసరాల్లోకి వరద నీరు చేరడంతో యుద్ధప్రాతిపదికన తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. తిరునల్వేలిలోని మణిముత్తారు, సేర్వలార్ రిజర్వాయర్లు నిండడంతో ఉబరి నీటిని తామర భరణిలోకి విడుదల చేస్తున్నారు. కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలోని జలపాతాలన్నీ మూసివేశారు. సందర్శకులను అనుమతించడం లేదు. కాగా, చైన్నెలో 30వ తేదీ నుంచి వర్షాలు పడతాయని, శివారు జిల్లాలో సైతం కొన్ని చోట్ల మోస్తారుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చైన్నెకు నీరు అందించే వీరాణం చెరువు నిండడంతో ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. కడలూరు నుంచి కన్యాకుమారి వరకు సముద్రతీరంలో కెరటాల ఉధృతి పెరిగింది.
రామేశ్వరంలో కుండపోత


