కొనసాగుతున్న సర్వేయర్ల ఆందోళన
తిరువళ్లూరు: సర్వేయర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజుల నుంచి సమ్మెలో వున్న సర్వేయర్లు నాలుగోరోజు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఆందోళనలో తమిళనాడు సర్వేయర్ల సమ్మేళనం జిల్లా అధ్యక్షుడు ఆర్ఎం సెంథిల్కుమరన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మణిగండన్, తమిళనాడు గ్రామీణాభివృద్ధిశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షుడు గాంధీమదినాథన్ హాజరై ప్రసంగించారు. గాంధీమదినాథన్ మాట్లాడుతూ ఉద్యోగుల పని భారం తగ్గించాలని, సర్వేయర్ల విభాగాన్ని ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, సర్వేయర్ల ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో నిరవధిక నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. సంఘం కార్యదర్శి యశ్వంధర్దాస్, కోశాధికారి నారాయణన్, జాయింట్ కన్వీనర్ శరత్కుమార్, ఉపాధ్యక్షురాలు విద్య పాల్గొన్నారు.


