
జీవ వైవిధ్యాన్ని చాటిన వైల్డ్ తమిళనాడు
సాక్షి, చైన్నె : రాష్ట్ర జీవ వైవిధ్యాన్ని చాటేలా వైల్డ్ తమిళనాడు డాక్యుమెంటరీ ప్రీమియర్ రూపుదిద్దుకుంది. శుక్రవారం ఈ వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వ అటవీశాఖ, నేచర్ ఇన్ ఫోకస్ నేతృత్వంలో కల్యాణ్ వర్మ దర్శకత్వంలో అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని ఆవిష్కరించేలా, కొత్త సహజ చరిత్రను చాటే రీతిలో డాక్యుమెంటరిని అభయారణ్యంలోకి సైతం వెళ్లి చిత్రీకరించారు. తమిళనాడులోని అడువులు, జలపాతాలు, నదీ తీరాలు, పర్వతాలు, అటవీ సంపద, వృక్షాలు, అరుదైన జాతులు, వన్య ప్రాణులు, శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ, ఏనుగులు, చిరుత పులులు తదితర దిగ్గ జాల నుంచి మినుగురు పురుగుల వరకు అద్భుత ప్రదర్శనగా ఈ డాక్యుమెంటరిని తీర్చిదిద్దారు. ఒక గంట సినిమా ప్రయాణంగా దక్షిణ భారత దేశానికి చెందిన కెమెరామెన్ బృందం వైవిధ్యమైన, విస్మయం కలిగించే ప్రకృతి దృశ్యాలను సంగ్రహించేలా నాలుగేళ్లు శ్రమించి ఈ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. మూడు సార్లు గ్రామీ అవార్డు అందుకున్న రికీ కేజ్ స్వర పరిచిన ఈ డాక్యుమెంటరీ సౌండ్ ట్రాక్, ప్రకృతి దృశ్యాల స్వరాలను అందించగా, వాయిస్ను సినీనటుడు అరవింద్ స్వామి అందించడం విశేషం. కల్యాణ వర్మ దర్శకత్వంలో సుందరం ఫాస్టెనర్స్ ఎండీ ఆరతి కృష్ణ నిర్మాతగా, అఖిలేష్ తాంబే కోడైరెక్టర్, ఎడిటర్గా, రోహిత వర్మ ఎగ్జిక్యూటీవ్ నిర్మాతగా ఈ డాక్యుమెంటరీకి వ్యవహరించారు.
ఇంజిన్లో సాంకేతిక లోపం
–గంటపాటు ఆగిన లాల్బాగ్ ఎక్స్ప్రెస్
తిరుత్తణి: ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గురువారం లాల్బాగ్ ఎక్స్ప్రెస్ గంటపాటు ఆగడంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు నుంచి గురువారం ఉదయం చైన్నె సెంట్రల్కు బయల్దేరిన లాల్బాగ్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరక్కోణం చేరుకుంది. అక్కడ నుంచి తిరువలంగాడు రైల్వేస్టేషన్ వద్ద చేరుకుంటుండగా అకస్మాత్తుగా ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మార్గమధ్యలో నిలిచిపోయింది. వెంటనే డ్రైవర్ అరక్కోణం రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సాంకేతిక నిపుణులు తమ సిబ్బందితో తిరువలంగాడు రైల్వేస్టేషన్కు చేరుకుని ఇంజిన్లో సమస్య పరిష్కరించే ప్రయత్నించారు. అయితే వీలుకాకపోవడంతో మరో ఇంజిన్ తీసుకొచ్చి చైన్నెకు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో గంటపాటు రైలు ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రయాణికులు విద్యుత్ రైళ్లలో వెళ్లారు.
కేవీబీ ఆర్థిక ఫలితాలు విడుదల
సాక్షి, చైన్నె: 2025 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన త్రైమాసికం, అర్ధ సంవత్సర ఆర్థిక ఫలితాలను కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ) శుక్రవారం స్థానికంగా ప్రకటించింది. ఆ బ్యాంక్ సీఈఓ బి.రమేష్బాబు మాట్లాడుతూ రెండవ త్రైమాసికం ముగింపులో బ్యాంక్ రూ.2 లక్షల కోట్ల వ్యాపారాన్ని చేరుకోవడం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. గత మూడున్నర సంత్సరాలలో బ్యాంక్ రూ.75 వేల కోట్ల వ్యాపారాన్ని సాధించిందన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి బ్యాంకు మొత్తం వర్తకం రూ.2,03,216 కోట్లుగా ప్రకటించారు. ఇది రెండవ త్రైమాసికంలో స్థిరమైన వృద్ధి వేగాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అడ్వాన్సులు రూ.92,724 కోట్లకు పెరిగినట్టు, డిపాజిట్లు రూ.1,10,492 కోట్లకు పెరిగినట్టు వివరించారు. సమ్మిళిత వృద్ధి అన్నది అర్ధ సంవత్సరంలో రూ.1,095 కోట్ల నికర లాభానికి చేరినట్టు తెలిపారు.
1,937 బస్సుల
కొనుగోలుకు ఒప్పందం
కొరుక్కుపేట: రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం 1,937 కొత్త లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలు కోసం అశోక్ లేలాండ్ కార్పొరేషన్న్తో తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ ఇప్పటికే 21 వేలకు పైగా అశోక్ లేలాండ్ బస్సులను నడుపుతుండగా, భారతదేశ వాణిజ్య వాహన తయారీ సంస్థ, హిందూజా గ్రూప్ ప్రధాన సంస్థ అయిన అశోక్ లేలాండ్ నుంచి ఇప్పుడు అదనంగా 1,937 బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ కొత్త బస్సులు అధునాతన బీఎస్ 6 సాంకేతికత కలిగిన ఇంజిన్లతో భద్రత, పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా తాజా ఏఐఎస్ 153 కంప్లైంట్ ఛాసిస్ ప్లాట్ఫామ్పై నిర్మించనున్నారు.

జీవ వైవిధ్యాన్ని చాటిన వైల్డ్ తమిళనాడు