
మరో కొత్త పథకానికి డీఎంకే ప్రభుత్వం శ్రీకారం
ప్రజా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్రంలో మరో కొత్త పథకం ఆగస్టు రెండున శనివారం అమల్లోకి రానుంది. నళం కాక్కుం స్టాలిన్( ఆరోగ్య సంరక్షణలో స్టాలిన్) పేరిట 38 జిల్లాలో విస్తృతంగా వైద్య శిబిరాలను వైద్యఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది.
● ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శిబిరాలు ● రేపటి నుంచి అమల్లోకి.. ● సచివాలయానికి సీఎం స్టాలిన్ ● ప్రారంభోత్సవాలతో బిజీబిజీ
ట్రాన్స్ జెండర్ల కోసం పాలసీని విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి
పోలీసు శాఖలో నిర్మించిన కొత్త భవనాలను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: 2021లో అధికార పగ్గాలు చేపట్టినానంతరం అందరికీ అన్నీ నినాదంతో బృహత్తర పథకాలను సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం విస్తృతంగా అమలు చేస్తూ వస్తోంది. అన్నిరంగాలలో ప్రగతి, జిల్లాల అభివృద్ధి, సమగ్ర సామాజిక సంక్షేమం, ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా ప్రణాళికలు, పథకాలను అమలు చేస్తున్నారు. అలాగే, వైద్యపరంగా ఆస్పత్రులను బలోపేతం చేయడమేకాకుండా మనల్నిరక్షించే 48 నినాదంతో వైద్య సేవలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాలలో చేసిన ప్రకటన మేరకు మెరుగైన వైద్యాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లే విధంగా ఆగస్టు 2న ఆరోగ్య సంరక్షణలో స్టాలిన్ నినాదంతో వైద్య శిబిరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ పథకాన్ని చైన్నె సెయింట్ పీట్స్ ఆంగ్లో ఇండియన్ స్కూల్ వేదికగా సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం తమిళనాడులోని 38 జిల్లాల్లోనూ అమలు కానుంది. ప్రత్యేక వైద్య శిబిరాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అయ్యే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరాలు స్థానిక ప్రభుత్వ సంస్థలు, పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖ, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, మహిళా శాఖ, కార్మిక సంక్షేమం , నైపుణ్యాల అభివృద్ధి శాఖ, దివ్యాంగుల సంక్షేమం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, తదితర శాఖలు, వివిధ విభాగాలను మిళితం చేసే పాఠశాలు, కళాశాలల ఆవరణలో నిర్వహించనున్నారు. గ్రేటర్ చైన్నె విషయానికి వస్తే ప్రతి జోన్కు ఒక శిబిరం చొప్పున 15 మండలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పరిమిత ప్రత్యేక వైద్య సదుపాయాలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు, మురికి వాడలు, గిరిజ ప్రాంతాలలో అధిక ప్రాధాన్యతను ఇచ్చే విధంగా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
136 మంది విద్యార్థులకు సత్కారం
ఆస్పత్రిలో చికిత్స పొందిన పది రోజుల అనంతరం సీఎం స్టాలిన్ సచివాలయానికి గురువారం వచ్చారు. ఆయనకు అధికారులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ప్రారంభోత్సవాలు సీఎంచేశారు. ఆది ద్రావిడులు , గిరిజనులు సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని 2025–26 విద్యా సంవత్సరంలో ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనియన్ యూనివర్సిటీలు, నేషనల్ వంటి సంస్థలు, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ లా యూనివర్సిటీ, మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలలో అడ్మిషన్ పొందిన 136 మంది విద్యార్థులకు సీఎం స్టాలిన్ ల్యాప్టాప్లు, ప్రశంసా పత్రాలలను అందజేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, వసతి ఫీజులు వంటి విద్య కోసం అయ్యే ఖర్చులు, ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు రుసుముతో సహా అన్ని రుసుములు తమిళనాడు ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలోడిప్యూటీసీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రి మది వేందన్, సీఎస్మురుగానందం, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కె లక్ష్మీ ప్రియ, ఆది ద్రావిడర్ సంక్షేమ కమిషనర్ టి. ఆనంద్, గిరిజన సంక్షేమం డైరెక్టర్ఎస్. అన్నాదురై తదితరులు పాల్గొన్నారు.
మదురై జైలుకు కొత్త భవనం..
పోలీసులు, అగ్నిమాపక , జైళ్లు శాఖ తరపున రూ. 45.47 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు, అలాగే మధురై సెంట్రల్ జైలును రూ. 229.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్, రఘుపతి, ముత్తుస్వామి, హోం శాఖకార్యదర్శి ధీరజ్కుమార్, అగ్నిమాపక శాఖ డీజీపీ సీమా ఆగర్వాల్, పోలీసు హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ వినీత్ దేవ్ వాంఖడే, తమిళనాడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ కుమార్ యాదవ్, పోలీసు సర్వీసు డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మహేశ్వర్ దయాళ్, చైన్నె కమిషనర్ అరుణ్, తాంబరం కమిషనరన్ అబిన్ దినేష్ మోదక్, పోరెన్సీక్ సైనన్స్ డైరెక్టర్ డాక్టర్ శివప్రియ పాల్గొన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ తరపున రూపొందించిన తమిళనాడు రాష్ట్ర ట్రానన్స్జెండర్లు పాలసీ –2025ను సీఎం విడుదల చేశారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, వివిధ సేవలు, స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం వరకు సహకారం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గీతా జీవన్ , సాంఘిక సంక్షేమం శాఖ కార్యదర్శి జయశ్రీ మురళీ ధరన్, అదనపు కార్యదర్శి ఎస్. వలర్మతి, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ సంగీత, ప్రణాళికా సంఘం సభ్యులు డా. నర్తకి నటరాజ్ పాల్గొన్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్ర వాణిజ్య మండలికి టీఎన్పీఎస్సీ ద్వారా ఎంపికై న 40 మందికి ఉద్యోగ నియమాక ఉత్తర్వులను సీఎం అందజేశారు. చివరగా వాణిజ్య పన్ను శాఖకు 27 కోట్ల 4 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు రాష్ట్ర పన్నుల కార్యాలయాల భవనాలు, 12 సబ్–రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. చెంగల్పట్టు రిజిస్ట్రేషన్ జిల్లాలోని తిరుపోరూర్ సబ్–రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కొత్తగా నవలూర్, కేలంబాక్కం పేరిట రెండు కొత్త సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పి మూర్తి, వాణిజ్య పన్ను , రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శిల్పా ప్రభాకర్ సతీష్, కమిషనర్ శ్రీ ఎస్. నాగరాజన్, , రిజిస్ట్రేషన్ శాఖ అధ్యక్షుడు దినేష్ పొన్రాజ్ ఆలివర్ పాల్గొన్నారు.
అనేక రకాల వైద్య సేవలు..
ఈ వైద్య శిబిరాలలో మధుమేహం, మానసిక, గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడే రోగులకు, గర్భిణి మహిళలు,పాలు ఇచ్చే తల్లులు, పిల్లలకు , దివ్యాంగులకు , వెనుకబడిన సామాజిక వర్గాలకు అధికప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎకోకార్డియోగ్రామ్, అల్ట్రాసౌండ్ స్కాన్, మహిళలకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించనున్నామన్నారు. ఇండియన్ మెడిసిన్ సంబంధించిన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, చర్మవ్యాధి, చెవి, ముక్కు , గొంతు వైద్యం, ప్రసూతి శాస్త్రం, సాంప్రదాయ వైద్యం, దంతవైద్యం, నేత్ర వైద్యం, మనోరోగ చికిత్స, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్,డయాబెటిస్ , రేడియాలజీ వైద్యులు సేవలు అందించనున్నారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద దివ్యాంగులకు రిజిష్ట్రేషన్లు, ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్లుకూడా ఈ శిబిరాలలోప్రధానం చేయనున్నారు. డేటా సేకరణ, తదుపరి పర్యవేక్షణ, తదుపరి చికిత్స గురించి ఆధునిక ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ(హెచ్ఎంఐఎస్ 3.ఓ) ద్వారా పరిర క్షించే విధంగా చర్యలు చేపట్టారు.

మరో కొత్త పథకానికి డీఎంకే ప్రభుత్వం శ్రీకారం

మరో కొత్త పథకానికి డీఎంకే ప్రభుత్వం శ్రీకారం

మరో కొత్త పథకానికి డీఎంకే ప్రభుత్వం శ్రీకారం