
699 మంది విద్యార్థులకు 7.5 శాతం కోటా సీట్లు
సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని నీట్లో మంచి మార్కులు సాధించి 7.5 శాతం ప్రత్యేక కోటా కింద ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్న 699మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ ఉత్తర్వులను అందజేశారు. 2025–26 సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు 7.5 శాతం రిజర్వుడ్ కోటా సీట్లను భర్తీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు సీట్లను కేటాయించారు. ఈ మేరకు 494 మందికి ఎంబీబీఎస్, 119 మందికి దంత వైద్య సీట్లు కేటాయించారు. మొత్తం 613 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాల కోటా ఆధారంగా మొత్తంగా 699 మంది విద్యార్థులను సీట్లు వరించాయి. విద్యార్థులకు మంత్రి ఎం. సుబ్రమణియన్ సీట్ల కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి సెంథిల్కుమార్, వైద్య విద్య డైరెక్టర్ తెరని రాజన్, తదితరులు పాల్గొన్నారు.
8.23 శాతం పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య
కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో విమానాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో అంతర్జాతీయ టెర్మినల్ , దేశీయ టెర్మినల్లో ప్రయాణికుల సంఖ్య 8.23 శాతం పెరిగిందని అధికారులు తాజాగా వెల్లడించారు. ఇందులో చైన్నె అంతర్జాతీయ టెర్మినల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు బయలుదేరే , వచ్చే ప్రయాణికుల సంఖ్య 30,49, 693 మందిగా ఉంది. గత సంవత్సరం మొదటి 6 నెలల్లో ఈ సంఖ్య 29 ,73,265గా ఉందని పేర్కొన్నారు.
రౌడీకి రోజూ 50 మంది పోలీసులతో భద్రత
తిరువొత్తియూరు: చైన్నెకి చెందిన 18 హత్యలు సహా 50కి పైగా కేసులలో నిందితుడైన ఓ రౌడీ ధర్మపురి కోర్టులో రోజూ బెయిల్పై సంతకం చేసి వెళ్తున్నాడు. అతని ప్రాణాలకు ముప్పు ఉన్నందున పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. వివరాలు.. చైన్నె ఎన్నూర్ ప్రాంతానికి చెందిన ధనశేఖరన్ (42) చైన్నె, మదురై సహా తమిళనాడులోని వివిధ జిల్లాలలో 18 హత్యలు, దోపిడీలు వంటి 50కి పైగా కేసులలో నిందితుడు. అజ్ఞాతంలో ఉన్న ఇతనిని పోలీసులు గాలిస్తున్న క్రమంలో ధనశేఖరన్ ముందస్తు బెయిల్ కోరుతూ కొన్ని రోజుల క్రితం ధర్మపురి క్రిమినల్ కోర్టులో లొంగిపోయాడు. న్యాయమూర్తి అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ధర్మపురి క్రిమినల్ కోర్టులో రోజూ హాజరై సంతకం చేయాలని ఆదేశించారు. దీని ప్రకారం గత 5 రోజులుగా, ప్రతి ఉదయం ధనశేఖరన్ తన స్నేహితులతో కలిసి ధర్మపురి కోర్టుకు వచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. వివిధ కేసులలో నిందితుడైన ఇతనికి బాధితుల నుంచి ఎప్పుడైనా ప్రాణహాని ఉండవచ్చు అనే కారణంతో 50కి పైగా పోలీసులు అతను వచ్చినప్పుడు ధర్మపురి జాతీయ రహదారి నుంచి కోర్టు ప్రాంగణం వరకు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా ధనశేఖరన్కు బాధితుల నుంచి ప్రాణహాని ఉన్నందున అతను ఎక్కడికి వెళ్తున్నాడు అనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు.
కారుణ్య నియామకాలపై
నిర్ధిష్ట విధానం ఎప్పుడు?
– రవాణా శాఖకు హైకోర్టు ప్రశ్న
కొరుక్కుపేట: తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న రవాణా కార్మికుల కుటుంబాలకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని.. మద్రాస్ హైకోర్టు తమిళనాడు రవాణా శాఖను ప్రశ్నించింది. ఈమేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వివరాలు.. వైద్యపరంగా పని చేయడానికి అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు , వారి కుటుంబాలకు వివిధ అంశాల ప్రాతిపదికన కారుణ్య ఉపాధి కల్పిస్తున్నారు. అయితే దీనిపై ఓ నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించడం, అమలు చేయడంపై మార్గదర్శకాలను కోరుతూ తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ అవినీతి నిరోధక ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరపున రవాణా కార్మికులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను తమిళనాడు ప్రభుత్వ రవాణా శాఖ పరిపాలనా విభాగంలో ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎం. శ్రీవాస్తవ, జస్టిస్ సుందర్ మోహన్తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రజా రవాణా సేవలను నేరుగా అందిస్తున్న కార్మికులకు కారుణ్య అవకాశాల కల్పనలో ఎందుకు లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నరని, ఈమేరకు ఉన్న సమస్యలను తెలియజేయాలని రవాణా శాఖ కార్యదర్శిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.