
ప్రతిభ చూపిన ఎస్ఐలకు కమిషనర్ రివార్డు
తిరువళ్లూరు: ఓ ప్రైవేటు పోర్టులో సుమారు 9 కోట్లు రూపాయలు విలువ చేసే వెండి వస్తువులు చోరీకి గురైన క్రమంలో నిందితులను పట్టుకోవడంలో చురుకుగా పని చేసిన పోలీసులు, ఎస్ఐలను ఆవడి కమిషనర్ శంకర్ ప్రశంసించి రివార్డును అందజేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాట్టుపళ్లిలోని ఓ పోర్టులో భారీగా వెండి వస్తువులు కంటైనర్ నుంచి మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసును ఛేదించడానికి ముగ్గురు ఎస్ఐలతో కూడిన స్పెషల్ టీమ్ను కమిషనర్ శంకర్ ఏర్పాటు చేశారు. వీరు రెండు వారాల్లో కేసును చేదించి 12 మందిని అరెస్టు చేయడంతో పాటు చోరీకి గురైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ముగ్గురు ఎస్ఐలను కమిషనర్ శంకర్ ప్రశంసించి వారికి రివార్డును అందజేశారు.