క్లుప్తంగా
బ్లాక్బస్టర్ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి,చైన్నె: ఫూవీస్ వేదికగా బ్లాక్బస్టర్ ఫుడ్ ఫెస్టివల్కు శ్రీకారం చుట్టామని సినీ పోలీస్ ఇండియా ఎండీ దేవాంగ్ సంపత్ తెలిపారు. మూడు నెలల్లో పాన్ ఇండియా ప్రచారం 40కు పైగా నగరాలలో, 80కు పైగా ప్రదేశాలలో చేపట్టడమే కాకుండా 21 కొత్త కార్యక్రమాల నిర్వహణ గురించి బుధవారం స్థానికంగా ఆయన ప్రకటించారు. దేశ వ్యాప్తంగా అన్ని సినీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈకొత్త సంవత్సరంలో ఆహారం, సినిమా అంటూ ఫూవీస్ వేదికగా 41 నగరాలలో 491కు పైగా స్క్రీన్లలో తాము ఈ ఫుడ్ మెనూ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశామన్నారు. బ్లాక్బస్టర్ ఫుడ్ ఫెస్టివల్ మార్చి వరకు కొనసాగుతుందని ప్రకటించారు.
నంబర్ 1 ఈవీగా విండ్సర్
సాక్షి, చైన్నె : 2025లో నంబర్ 1 ఎలక్ట్రిక్ వాహనంగా విండ్సర్ మార్కెట్లో వినియోగ దారుల్లోకి వెళ్లిందని జేఎస్డబ్ల్యూఎంజీ మోటార్ ఇండియా ఎండీ అనురాగ్ మెల్హోత్రా తెలిపారు. ఈవీ అమ్మకాలలో 2025లో తాము సాధించిన ఘనత వివరాలను బుధవారం స్థానికంగా ఆయన ప్రకటించారు. ఆ మేరక ఎంజీ మోటారు ఇండియా సీవై 2025లో 46,735కు పైగా విండ్సర్ యూనిట్లను వినియోగదారులకు అందించిందన్నారు. 2024తో పోల్చితే 2025లో ఈవీ అమ్మకాలు 111 శాతం పెరిగిందన్నారు. 2026లో మరింత పెంచే విధంగా విస్తృత కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. ఇండియాస్ నంబర్ వన్ సెల్లింగ్ ఈవీగా ఎంజీ విండ్సర్ అవతరించిందన్నారు.
అనుమానాస్పద స్థితిలో
విద్యార్థిని మృతి
అన్నానగర్: అనుమానాస్పద స్థితిలో ఓ హోమియోపతి విద్యార్థిని మృతిచెందింది. సేలం లోని కన్నంపల్లి నుంచి ఇలంపిళ్లైకి వెళ్లే దారిలో సిద్ధార్ కోయిల్ సమీపంలో ఒక ప్రైవేట్ హోమియోపతి వైద్య కళాశాల ఉంది. ఈ కళాశాలలో తిరునెల్వేలి జిల్లాకు చెందిన హర్షిణి (22) అనే విద్యార్థిని నాల్గవ సంవత్సరం హోమియోపతి చదువుతోంది. ఆమె ఆ ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ఈ స్థితిలో ఆమె తన గదిలో అనుమానాస్పదంగా మృతిచెందినట్లు బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. ఇరుంపాలై పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై లైంగికదాడి
–ఇద్దరిపై పోక్సో కేసు
తిరుత్తణి: ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తిరువలంగాడు ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక రెండవ తరగతి చదువుతుంది. బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక నొప్పితో బాధపడుతుండడంతో తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు లైంగిక దాడికి జరిగినట్లు గుర్తించారు. తిరుత్తణి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు పోలీసులు చిన్నమ్మపేటకు చెందిన నాగేంద్రన్(50), నెల్సన్(25) అనే ఇద్దరిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
అపోలోలో వృద్ధురాలికి
అధునాతన శస్త్ర చికిత్స
కొరుక్కుపేట: చైన్నె నగరంలోని గ్రీమ్స్ లైన్లో ఉన్న అపోలో హాస్పిటల్లో గుండెకు తగినంత ప్రాణవాయువు, రక్తం సరఫరా కాకుండా ఆరుమాసాలకు పైగా ఛాతీ నొప్పితో బాధపడిన 62 యేళ్ల వృద్ధురాలికి అధునాతన కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ (సీఎండీ) అంచనాల ప్రకారం అరుదైన చికిత్సను నిర్వహించినట్లు ఆ హాస్పిటల్ హృద్రోగ శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ రెఫాయ్ సౌగత్ అలీ తెలిపారు. ఆంజినా అనే గుండెనొప్పితో బాధపడుతుండిన ఆ వృద్ధురాలిని ఆరుమాసాలపాటు పరిశీలనలో ఉంచిన మీదట ప్రత్యేక డయాగ్నస్టిక్ వైర్ని ఉపయోగించి సీఎండీ అంచనాను నిర్ధారించుకుని ఈ చికిత్సలందించినట్లు వివరించారు. ఈ చికిత్స ద్వారా రోగి 24 గంటలలోపే సంపూర్ణంగా కోలుకున్నట్లు తెలిపారు. సీఎండీ అంచనాను నిర్వర్తించే అధునాత పరికరాలు ఉన్న కొద్ది ఆసుపత్రులలో అపోలో హాస్పిటల్స్ ఒకటి అని చైన్నె రీజిన్ సీఈఓ డాక్టర్ ఇలంకుమారన్ కలియమూర్తి తెలిపారు. మధుమేహం, ఊబకాయం, రక్తహీనత, టెన్షన్ తదితర కారణాల వల్ల గుండెపోటును తలపించే రీతిలో నెలలతరబడి ఛాతీ నొప్పి ఉండటమే ఆంజినా లక్షణమని ఆయన వెల్లడించారు.
ఎన్ఎక్స్టీ ఫేస్ అంబాసిడర్గా జెమిమా
సాక్షి, చైన్నె : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్కిన్ కేర్గా ఉన్న ఎన్ఎక్స్టీ ఫేస్కు మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ అంబాసిడర్గా నియమితులయ్యారు. అసోసియేషన్లో భాగంగాఎన్ ఎక్స్టీ ఫేస్ డబ్ల్యు పీఎల్ సీజన్తో సమీకృత ప్రచారాన్ని జెమిమా ప్రారంభిస్తున్నట్టు గా ఆ సంస్థ వ్యవస్థాపకురాలు దమయంతి బుధవారం స్థానికంగా ప్రకటించారు. జెమీమాను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ అంబాసిడర్గా నియమించామని ప్రకటించారు. మహిళా క్రికెట్లో స్థితి స్థాపకత, ఆత్మ విశ్వాసం , అడ్డుంకులను బద్దలు కొట్టే విలువలు మెండుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆదిశగా జెమిమా తమ ఆవిష్కరణలకు మద్దతుగా ముందుకు సాగనున్నారని, త్వరలో ప్రచారం మొదలు అవుతుందని వివరించారు.


