కనులపండువగా కన్నికలమ్మకు క్షీరాభిషేకం
కొరుక్కుపేట: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి సప్త కన్నికల సమేత కన్నికలమ్మకు అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకాన్ని శుక్రవారం కనులపండువగా నిర్వహించారు. చైన్నెలోని పాత చాకలిపేట, నమశ్శివాయ మొదలి వీధిలో వెలసియున దేవాంగ సంఘం కన్నికల గుడిలో అష్టోత్తర శత కలశ క్షీరాభిషేక మహోత్సవాన్ని గురువారం గణపతి పూజతో శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం గణపతి పూజలో ఆరంభమైన ఈ వేడుకల్లో ఉదయం 7 గంటలకు మహిళలు కలశ పూజ చేసి పాలబిందెలు తీసుకుని మాడ వీధిలో ప్రదక్షిణగా ఆలయానికి చేరుకున్నారు. కన్నికలమ్మకు 108 కలశాలతో క్షీరాభిషేకం చేశారు. ఆ తరువాత అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, ధూపదీప ఆరాధనలను శాస్త్రోక్తంగా చేపట్టారు. భక్తులు, మహిళలు, చిన్నారులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేడుకలో పాల్గొని అమ్మవారిని కొలిచారు. చెన్నపురి దేవాంగ సంఘం నిర్వాహ ధర్మకర్తలు కాట్న శ్రీరామకృష్ణ, గులవల కె.మనోహర్, దేవాంగ సంఘంకు చెందిన కోణంకి కె.జనార్ధనం, బ్రాహ్మణపల్లి ప్రతాప్, మద్రాసు ఉన్నత న్యాయస్థానం న్యాయవాది జక్కుల హరికృష్ణ, మాధవయ్య, మాచర్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.