నేరేడుచర్ల : వానాకాలం సీజన్లో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రస్తుతం జిల్లాలో 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందని జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్రెడ్డి తెలిపారు. గురువారం నేరేడుచర్లలోని ప్రాథమిక సహకార సంఘంలో యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం సీజన్లో 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించారని, ఈ సంవత్సరం 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందన్నారు. జూన్ నుంచి పంట కాలం పూర్తయ్యే వరకు నిరంతరంగా యూరియా సరఫరా అవుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైతులు ఒకే సారి కాకుండా అవసరమున్న మేరకు యూరియాను కొనుగోలు చేయాలని సూచించారు. మండలం యూనిట్గా గురువారం నుంచి యూరియా యాప్ ప్రారంభమైందన్నారు. ఎల్నీనో ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసే అవకాశాలు లేవని, సాగర్ ప్రాజెక్టులో కూడా సమృద్ధిగా నీరు లేనందున రైతులు వర్షాధార, ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి జావెద్, సహకార సంఘం సిబ్బంది ఉన్నారు.


