కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మూడురోజుల నుంచి ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలని, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ ద్రావణాలను తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలని, తలకు టోపీ, రుమాలు, గొడుగు ఉపయోగించడం మంచిదని పేర్కొన్నారు. బాధితుల సహాయార్ధం కలెక్టరేట్లో ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ 6281492368ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


