సూర్య ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

సూర్య ప్రతాపం

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

ఆదివారం ఎండవేడి ఇలా..

ప్రాంతం గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతం గరిష్ఠ ఉష్ణోగ్రత

తిరుమలగిరి (తుంగతుర్తి), భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం 13 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా భానుడు తన ప్రతాపం చూపెడుతుండడంతో జిల్లా అగ్ని గుండంగా మారుతోంది. మోతె మండలం మామిళ్లగూడెంలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బయట ఎండతో పాటు వడగాలులు వీస్తుండగా.. ఇంట్లో ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి రోహిణి కార్తె మొదలవుతుండగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

పెరిగిన వడగాలులు

ప్రస్తుతం ఎండతో పాటు వేడిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలుల ప్రభావంతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు సైతం ఆధునిక సాంకేతికతో ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీజీఐసీసీ) ఎండ వేడిని సూచిస్తూ నేరుగా సెల్‌ఫోన్‌లకు హెచ్చరికలను పంపిస్తోంది. ఎండ వేడి ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ మెసేజ్‌లు పంపుతోంది. జిల్లా అధికారులు సైతం వివిద సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.

13 మండలాల్లో అత్యధికంగా..

మోతె మండలంలో అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోదాడ మండలంలో 45.8 డిగ్రీలు, మేళ్లచెర్వు మండలంలో 45.8, మునగాల మండలంలో 45.7, చివ్వెంల మండలంలో 45.7, నడిగూడెంలో 45.6 డిగ్రీలు, పెన్‌పహాడ్‌, చిలుకూరు, సూర్యాపేట మండలాల్లో 45.5 డిగ్రీల చొప్పున, హుజూర్‌నగర్‌ మండలంలో 45.4, నూతనకల్‌ మండలంలో 45.3, చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా జాజిరెడ్డిగూడెం మండలంలో 43.3 డిగ్రీలు నమోదైంది.

నేటి నుంచి మరింత తీవ్రం

ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభమై జూన్‌ 8 వరకు కొనసాగుతుంది. ఈ రోజుల్లో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం 46 డిగ్రీలు నమోదవుతుండగా రోహిణి కార్తెలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలని, నీరు, పానీయాలు తాగుతూ ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.

మామిళ్లగూడెం 46.2

ఉర్లుగొండ 45.8

మేళ్లచెర్వు 45.8

మునగాల 45.7

తిరుమలగిరి

(చివ్వెంల) 45.7

నడిగూడెం 45.6

పెన్‌పహాడ్‌ 45.5

చిలుకూరు 45.5

బలరాంతండా

(సూర్యాపేట) 45.5

మామిళ్లగూడెంలో

46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

ఫ 13 మండలాల్లో 45 డిగ్రీలకు పైగానే..

ఫ వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి

ఫ నేటి నుంచి రోహిణి కార్తె

Advertisement
 
Advertisement
Advertisement