భానుపురి (సూర్యాపేట) : జిల్లా సగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు క్షేత్రస్థాయి అధికారులు కలికట్టుగా పని చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రవిమహల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి నివేదిక జిల్లాస్థాయి సమావేశంలో ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు సొంత భవనాలు లేకపోతే ఎంపీడీఓ ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 370కి పైగా భవనాల ప్రతిపాదనలు వచ్చాయని, ఇప్పటికే 200 భవనాలకు గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని 50 మంది ప్రత్యేక అవసరాల పిల్లల కోసం 342 ప్రత్యేక పరికరాలను అందజేస్తున్నట్లు ప్రకటించారు.
మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని ఎస్పీ కె.నరసింహ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాలపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ను వారు సందర్శించారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఇద్దరు ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామక ఉత్తర్వులను అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్చైర్మన్ షఫీఉల్లా, డీఆర్డీఓ సన్యాస య్య, జడ్పీ సీఈఓ శిరీష, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సీపీఓ కిషన్, డీఎస్సీడీఓ దయానందరాణి, అధి కారులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


