సూర్యాపేట : ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలో జే ఫంక్షన్హాల్లో శుక్రవారం శ్రీమాదిగ మహాశక్తిశ్రీ నాయకులు సగరపు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా మాదిగల బతుకులు మారడం లేదన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలు ఉంటే అగ్రకులాల వారు అధికారాన్ని చలాయిస్తూ మాదిగలను, బహుజన కులాలను పావులుగా, ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల ఓట్లు మాదిగలకే వేసుకుంటే మన సత్తా ఏందో తెలుస్తదన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 50 వేల మందికి పైగా మాదిగలు ఉన్నారన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అందించడంలో పాలకులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మాల కుటుంబాలకే, సీట్లు మంత్రి పదవులు దక్కాయన్నారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, ప్రొఫెసర్ కనకయ్య, దుర్గయ్య గౌడ్, బండారు సుధాకర్, కేవీ, మాచర్ల సైదులు, డేవిడ్, మస్తాన్, దయానంద్, జయశంకర్, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి
మోత్కుపల్లి నర్సింహులు


