సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కుక్కలు చర్మవ్యాధులతో బాధపడుతున్నాయన్న సమాచారంతో హైదరాబాద్ బ్లూక్రాస్ షెల్టర్ డైరెక్టర్, సీఎఫ్ఓ ఎన్ఎస్కే కుమారి బుధవారం ప్రత్యేక వైద్యబృందంతో చేరుకొని చికిత్స చేపట్టారు. 25వ వార్డులో చర్మవ్యాధులతో ఉన్న కుక్కలను వలల సాయంతో పట్టుకుని వాటి నుంచి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం ప్రత్యేక వ్యాక్సిన్ అందించారు. పలు వార్డుల్లోని శునకాల నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ఎస్కే కుమారి మాట్లాడుతూ చర్మవ్యాధులతో బాధపడుతున్న కుక్కల విషయమై తమ వలంటీర్ అందించిన సమాచారం మేరకు సూర్యాపేటకు వచ్చినట్లు తెలిపారు. సుమారు పది కుక్కల నుంచి రక్త నమూనాలను సేకరించామని, వాటి నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పారు. ప్రస్తుతం కుక్కలకు వ్యాక్సిన్లు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, కమిషనర్ హనుమంతరెడ్డి సహకారం అందించారని వివరించారు, కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, బ్లూ ఆఫ్ హైదరాబాద్ జిల్లా వలంటీర్ నరేందర్ నాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, 24, 25 వార్డు కౌన్సిలర్లు మన్నెం అరుణ మల్లేష్, కోడి శిరీష శివ, వైద్యులు పాల్గొన్నారు.


