మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం అర్చకులు స్వామివారి నిత్య కల్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభి షేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. నిత్యకల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరా
సరిగా జరిగేలా..
మేళ్లచెరువు : వేసవిలో విద్యుత్ సరఫరా డిమాండ్ అధికంగా ఉంటుంది. దాంతో ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడడం, హెచ్చుతగ్గులు వచ్చి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని నివారించేందుకు మేళ్లచెరువు మండలంలోని జగ్గుతండా గ్రామ సర్పంచ్ మంజుల సుధాకర్నాయక్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్లకు ఉండే ఎర్త్లకు పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని పోయిస్తున్నారు. దీని వల్ల వేసవిలో విద్యుత్ సరఫరాలో వచ్చే హెచ్చు తగ్గులను నివారించవచ్చని సర్పంచ్ తెలిపారు.
సాగర్లో టూరిజం హెరిటేజ్ వాక్
నాగార్జునసాగర్ : తెలంగాణ టూరిజం వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాగార్జునసాగర్లో హెరిటేజ్ టూరిజం వాక్ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటక అధికారి మహ్మద్ అక్బర్అలీ ఆధ్వర్యంలో స్థానిక టూరిజం విజయవిహార్ అతిథిగృహం ప్రాంగణంలో వాక్ చేశారు. జిల్లాలోని టూరిజం ప్రాంతాలకు సంబంధించిన బ్రోచర్లోని పలు ప్రాంతాలపై చర్చించారు. కార్యక్రమంలో టూరిజం గైడ్ సత్యనారాయణ, స్థానికులు నజీర్, అనిల్కుమార్, రాజగోపాల్, అడ్వకేట్ వినోద్కుమార్, మల్లికార్జున్, సిబ్బంది వెంకటస్వామి, అంజి, తులసి పాల్గొన్నారు.


