సూర్యాపేటటౌన్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో టీబీ వ్యాధి అనుమానితుల నుంచి పరీక్షల నమూనాల సేకరణను పెంచాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 54 రోజుల ప్రగతిపై బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగశాలల్లో పరీక్షల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, రిపోర్టులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు. ప్రాథమిక పరీక్షల్లో నెగటివ్ వచ్చినప్పటికీ, లక్షణాలు ఉంటే వెంటనే సాంపుల్స్ సేకరించి పరీక్షలకు పంపాలన్నారు. ఇప్పటి వరకు 21 గ్రామ పంచాయతీలు టీబీ ముక్త్గా మార్చినందుకు అభినందించారు. టీబీ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 67 గ్రామాలను గుర్తించి 32 గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 6,818 ఎక్స్రేలు తీయడంతో పాటు 2,941 మందికి ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా 149 టీబీ వ్యాఽధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీబీ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ పి.వెంకటపాపిరెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీశైలం, డిప్యూటీ డెమో సంజీవ్రెడ్డి, ఫార్మసిస్ట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీఎంహెచ్ఓ వెంకటరమణ


