సూర్యాపేట టౌన్ : సమాజ హితానికి పాటుపడాలని ఎస్పీ నరసింహ అన్నారు. కేసుల్లో సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్, గంజాయి కేసుల్లో షీట్స్ ఉన్న వ్యక్తులకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం డివిజన్ స్థాయి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో చేసిన పనుల నుంచి పాఠాలు నేర్చుకుని సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. అసాంఘిక చర్యలకు, నేరాలకు పాల్పడుతూ ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రతినెలా కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందరిపై పోలీసు నిఘా ఉందని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడవద్దని కోరారు. గరిడేపల్లి, మేళ్లచెరువు, మునగాల, మోతె పోలీస్ స్టేషన్లలో నమోదైన హత్య కేసుల్లో జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, సాయిరాం, శివతేజ, సిబ్బంది పాల్గొన్నారు.
భౌతికదాడులకు పాల్పడొద్దు
నూతనకల్ : సమాజంలో భౌతికదాడులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం నూతనకల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు పరిశీలించడంతో పాటు పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పాతనేరస్తులు, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషిచేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం గ్రామస్తులను చైతన్యవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగారం సీఐ నాగేశ్వరరావు, డీసీఆర్పీ ఇన్స్పెక్టర్ మగ్ధూమ్ అలీ, ఎస్ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


