సూర్యాపేట అర్బన్ : పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. మంగళవారం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం కమ్యూనిస్టులకే సాధ్యమని, ఇందుకు పుచ్చలపల్లి సుందరయ్యే ఆదర్శమన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా చిన్ననాటి నుంచే పోరాటం చేసిన మహా నాయకుడిని సుందరయ్య అన్నారు. తెలంగాణలో భూస్వామ్య జమీందారీ రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. వ్యవసాయ కార్మికులకు కూలి పెరగాలని, భూమి పంచాలని సంఘం పెట్టి విముక్తి పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, ఎల్గూరి గోవింద్, మద్దెల జ్యోతి, మేకన బోయిన శేఖర్, వన్ టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్, నాయకులు చినపంగి నర్సయ్య, మేకనబోయిన సైదమ్మ, మామిడి సుందరయ్య, అబ్బగాని భిక్షం, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం నేతలు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు


