భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్డీఓ పీడీ సన్యాయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీసీఓ ప్రవీణ్ కుమార్, డీఈఓ అశోక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
23 వరకు పర్యాటక వారోత్సవాలు
సూర్యాపేటటౌన్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటకశాఖ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రదేశాలు, మ్యూజియంలు, చారిత్రక కట్టడాల గురించి పర్యాటకులకు వివరించడానికి టూరి జం గైడ్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పురావస్తు శాస్త్రం కోర్సు, మ్యూజియాలజీ, లేదా గ్రాడ్యుయేట్లు అర్హులని తెలిపారు. వివరాలకు సెల్ : 9849905722. 9849905723 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో క్రీడల అధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


