భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రవ్యాప్తంగా పది నెలల్లో దాదాపు 15 వేల పెండింగ్ ఆర్టీఐ కేసులను పరిష్కరించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్న్ డాక్టర్ జి.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లు పివి శ్రీనివాస్ రావు, మోహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. రెండేళ్ల క్రితం వరకు కమిషన్ లేకపోవడంతో కమిషన్ లెవెల్లో దాదాపు 28 వేల కేసుల వరకు పెండింగ్లో ఉన్నట్లు వివరించారు. వాటిలో 18 వేల కేసుల హియరింగ్ పూర్తి చేసుకొని 16 వేల కేసుల్లో ప్రజలకు సమాచారం అందించామన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల మంది ప్రజలు ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటున్నారని తెలిపారు. మొదటి దశలో 50 శాతం కేసులను జిల్లాల పర్యటనలో పరిష్కారం చూపామని, మరో 50 శాతం కేసులను త్వరలో పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా ప్రజలకు సమాచార హక్కు చట్టంపై ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారని, అందుకే సూర్యాపేట జిల్లా నుంచి భారీగా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పౌరులు అడిగిన సమాచారాన్ని గడువులోగా అందించాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు.
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్
చంద్రశేఖర్రెడ్డి


