మునగాల : మునగాల మండల పరిధిలో జాతీయ రహదారి పక్క గ్రామాలకు చెందిన పశువులు నిత్యం రహదారిపై సంచరిస్తున్నాయి. దీంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పి పశువులను ఢీకొడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళ పశువులు కనిపించక ప్రమాదాలు జరిగి ప్రజలతో పాటు పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. రాత్రి వేళ ప్రమాదాల నివారణకు పది రోజుల క్రితం మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పశువులకు రేడియం స్టిక్కర్లు వేసే కార్యక్రమం కూడా ప్రారంభించారు. అయినా కొందరు పశువుల యజమానులు మాత్రం పశువులకు స్టిక్కర్లు వేయించేందుకు ముందుకు రాలేదు. ఇప్పటికై నా పశువుల యజమానులు అప్రమత్తమై తమ మూగజీవాలు హైవేపైకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా కాసరగడ్డ దీప
హుజూర్నగర్ : హుజూర్నగర్ కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా కాసరగడ్డ దీప నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న మారుతి ప్రసాద్ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఖమ్మంలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కాసరగడ్డ దీపను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మే నెల రెండవ తేదీ లోపు బదిలీ అయిన కోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


