భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లోని బస్స్టాప్, పబ్లిక్ ప్రాంతాలలో, ఉపాధి హామీ పనులు జరిగే చోట, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమయ్యే హౌస్ లిస్టింగ్లో ప్రతి ఉద్యోగి వారి కుటుంబ వివరాలు, 33 ప్రశ్నలకు వివరాలు అందించాలన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు, వారికి ఆ నివేదికను అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, డీఎంహెచ్ఓ పి.వెంకటరమణ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సీపీఓ కిషన్, డీటీడీఓ శంకర్, ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి దయానందరాణి, డీఐఈఓ బి. సులోచన రాణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్రెడ్డి, సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు.


