భానుపురి (సూర్యాపేట) : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు వీగిపోవడంతో కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ మనువాద సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న పార్టీ అన్నారు. ఆ పార్టీ మహిళా బిల్లును పార్లమెంటులో చిత్తశుద్ధితో ప్రవేశపెట్టలేదని, వీగిపోతుందని తెలిసే ప్రవేశపెట్టిందన్నారు. పార్లమెంట్లో బీజేపీ ఎంపీలుగా ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పాలన్నారు. మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని దేశంలో తమకు అనుకూలంగా డీలిమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూసిందని ఆరోపించారు. దేశంలో మహిళా హక్కుల కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. దేశంలో ప్రధాని, స్పీకర్లుగా మహిళలను ఎన్నుకున్నది తమ పార్టీనే అన్నారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో యూపీఏ చైర్పర్సన్గా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, మహిళా హక్కుల కోసం రాహుల్ గాంధీ అనేక పోరాటాలు చేశారని చెప్పారు. దేశ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీఉల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరిగుంట్ల వేణుగోపాల్, నాయకులు అబ్దుల్ రహీం, అంజద్ అలీ, నాగుల వాసు, సునీల్ రెడ్డి, దశరథ, శ్రీనివాస్, వీరన్న నాయక్, మాణిక్యం పాల్గొన్నారు.
ఫ కాంగ్రెస్ను దోషిగా చూపే ప్రయత్నాన్ని ఖండించాలి
ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య


