సూర్యాపేట అర్బన్ : అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో జరిగిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి నేటికీ ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు సొంతిల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలానికి ఒక గ్రామంలో మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పడం సరికాదని, అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పెంపు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నేటికీ అమలుకు నోచడం లేదన్నారు. సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగిళ్ల వెంకటచంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి, మేకన బోయిన సైదమ్మ, జిల్లా సభ్యులు త్రివేణి, సుందరి, రమాదేవి, భాగ్యమ్మ, నారాయణమ్మ పాల్గొన్నారు.


