సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండాలని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా బుధవారం మూడో రోజు సురక్షిత మాతృత్వ పద్ధతులు అనే అంశంపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. సురక్షిత మాతృత్వ పద్ధతులు సందేశాత్మక నాటిక ప్రదర్శించిన ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. నర్సింగ్ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్ మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రులు గర్బస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అర్హతలు ఉన్నవాటికి సకాలంలో అనుమతులు మంజూరు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై, వాటి ప్రాంగణాలను సీల్ వేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో డీఎంహెచ్వో డాక్టర్ పెండెం వెంకటరమణ, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ వెంకటేశ్వర్లు, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


