త్వరలో టెండర్ ప్రక్రియ
కోదాడ : చిలుకూరు మండలం బేతవోలు రోడ్డులో ముక్త్యాల కాలువపై ఉన్న ఇరుకు వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించనున్నారు. అందుకు ఇరిగేషన్ శాఖ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరయ్యాయి. మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. వంతెన నిర్మిణం పూర్తయితే ఇన్ని రోజులు ఇరుకు వంతెనతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఊరట లభించనుంది.
డబుల్ రోడ్డు వేసినా..
కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బేతవోలు క్రాస్ రోడ్డు నుంచి బేతవోలు గ్రామం మీదుగా జెర్రిపోతులగూడెం వరకు రూ.16 కోట్లతో డబుల్ రోడ్డు వేశారు. కానీ ఈ మార్గంలో ఉన్న ఇరుకు వంతెన వద్ద మాత్రం సింగిల్ రోడ్డే ఉంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనకు అటు, ఇటు డబుల్ లేన్ ఉండడంతో ఎదురుఎదురుగా వచ్చిన వాహనాలు ఒకేసారి వెళ్లలేక ఒక వాహనం వెళ్లేంత వరకు రెండోది నిలిచి పోవాల్సి వస్తోంది. రాత్రి సమయాల్లో రెండు వాహనాలు ఒకేసారి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి.
బరాఖత్గూడెం వద్ద నిర్మాణం
మునగాల మండలం బరాఖత్గూడెం నుంచి బేతవోలు రోడ్డులో ఉన్న ముక్త్యాల కాలువ 11.5 కిలోమీటర్ వద్ద కొత్త వంతెన నిర్మించనున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన కోటి రూపాయాలతో పాత వంతెనను తొలగించి ఆ ప్రాంతంలో కొత్తది నిర్మించనున్నారు. 29.28 మీటర్లు పొడవు, 7.5 మీటర్లు వెడల్పుతో కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. వంతెనకు రెండు వైపులా రక్షణ గోడను సైతం నిర్మించనున్నారు.
తొలగనున్న ఇబ్బందులు
ఇరుకు వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని ఈ ప్రాంత వాసులు పలుమార్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతికి విన్నవించారు. దాంతో వారు ప్రత్యేక చొరవ తీసుకొని వెంతెన నిర్మాణానికి కోటి రూపాయాలు మంజూరు చేయించారు. వెంతెన పూర్తయితే బేతవోలు, జెర్రిపోతులగూడెం, ఆచార్యులగూడెం, చెన్నారిగూడెం, పోలేనిగూడెం, కొమ్ముబండ తండా, సీతరాంతండాతో పాటు విజయవాడ –హైదరాబాద్ జాతీయ రహదారి పైకి వెళ్లే వాహనదారుల ఇబ్బందులు తొలగనున్నాయి.
ఫ రూ.కోటి విడుదల చేసిన ప్రభుత్వం
ఫ వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి
ఫ తీరనున్న ఇరుకు వంతెన కష్టాలు
ముక్త్యాల కాలువపై కొత్త వంతెన నిర్మాణానికి ఇరి గేషన్ శాఖ నుంచి కోటి రూపాయాలు మంజూరయ్యాయి. మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఆ తరువాత పనులు ప్రారంభిస్తాము. వంతెన నిర్మాణం పూర్తియితే వాహనదారుల ఇబ్బందులు తొలగుతాయి.
మానస, ఇరిగేషన్ ఏఈ, చిలుకూరు


