ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని కాశీగూడెం గ్రామ పంచాయతీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గురువారం ప్రజాపాలన గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో, గ్రామ పరిధిలో మద్యం అమ్మడం, కొనుగోలు చేయడం, తాగడం పూర్తిగా నిషేధమని, ఇందుకు గ్రామస్తులంతా కట్టుబడి ఉండాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని అతిక్రమిస్తే వారికి గ్రామస్థాయిలో చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. గ్రామ సర్పంచ్ ధర్మానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడికి
నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తే జరిమానా
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని ఏపూర్ గ్రామంలో భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ఇసుక అక్రమ రవాణాను నిలిపివేసేందుకు గ్రామస్తులు ఏకమయ్యారు. ఈ మేరకు గురువారం గ్రామ అభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. గ్రామ సమీపంలో ఉన్న ఏటి నుంచి కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండడంతో గ్రామంలోని బోర్లు ఎండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే ట్రాక్టర్కు రూ.50వేలు, సహకరించిన వారికి రూ.10వేల జరిమానా విధించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఇసుక రవాణా సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ చంద్ర మోహన్, అభివృద్ధి కమిటీని సభ్యులు పాల్గొన్నారు.


