టెన్త్ విద్యార్థులకు అల్పాహారం
పెన్పహాడ్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో సౌకర్యాలకు నిధులు కేటాయిస్తున్నాయి. ఇటీవలే మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తాజాగా ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో కేంద్రం మౌలిక వసతులు కల్పిస్తోంది. తరగతి గదులతో పాటు, మూత్రశాలలు, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలను సమకూరుస్తోంది. తాజాగా మోడల్ స్కూళ్లతోపాటు, జెడ్పీ హైస్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు అల్పాహారం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈమేరకు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల కోసం రూ.10,08,615, మోడల్ స్కూళ్లలో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం రూ.6,38,011 మంజూరయ్యాయి.
ప్రత్యేక తరగతుల సమయంలో అందించేలా..
జిల్లాలో 17 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 1254 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. మార్చి 10 వరకు 34రోజులు రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.15చొప్పున రూ. 510లు విలువైన అల్పాహారాన్ని ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల సమయంలో అందిస్తారు. ఇప్పటికే మోడల్ పాఠశాలల్లో జనవరి 28 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వీరితోపాటు జెడ్పీహెచ్ఎస్లో చదివే పదో తరగతి విద్యార్థులకు 19 రోజుల పాటు ఈనెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు అల్పాహారం అందజేయనున్నారు. జిల్లాలో 170 జెడ్పీహెచ్ఎస్లు ఉండగా.. వీటిలో చదివే 3539 మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది.
ఆకలి బాధలు తప్పాయి
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ సమయంలో అందిస్తున్న అల్పాహారంతో ఆకలి బాధలు తొలగిపోయాయి. చదువుపై మరింత దృష్టి సారించి మంచి ఫలితాలు సాధిస్తాం.
– మెర్సీ, పదో తరగతి,
ఆదర్శ పాఠశాల, అనాజిపురం
విద్యార్థులకు నాణ్యమైన,
రుచికరమైన స్నాక్స్ అందిస్తున్నాం
టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్స్ సమయంలో స్నాక్స్ అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన స్నాక్స్ అందిస్తున్నాం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలాగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– కోడి లింగయ్య, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్, అనాజిపురం
ఫ ఇప్పటికే మోడల్ స్కూళ్లలో అమలు చేస్తుండగా జెడ్పీ హైస్కూళ్లలోనూ
అందించాలని నిర్ణయం
ఫ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
ఫ జిల్లాలో 4790 మంది
విద్యార్థులకు ప్రయోజనం


