ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి
లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
భానుపురి (సూర్యాపేట) : మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్లు లెక్కింపు కేంద్రంలో అనుసరించాల్సిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్ వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్లు వేరు చేయడం, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి ఫలితాలను సమగ్రంగా నమోదు చేసి, సంబంధిత అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని, తదుపరి పరిశీలకుల అనుమతితో విజేతలను ప్రకటించాలని అధికారులకు సూచించారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు. గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బంది ఉదయం 7 గంటల వరకు లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జనరల్ అబ్జర్వర్ పాండా దాస్ మాట్లాడుతూ.. కౌంటింగ్ను చాలా పకడ్బందీగా నిర్వహించాలని, వ్యాలిడిటీ, ఇన్ వ్యాలిడిటీ ఓట్ల గురించి ఆర్వోలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీఓలు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
సూర్యాపేటటౌన్ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాట్లను ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లు క్రమశిక్షణ పాటించాలన్నారు. కేంద్రంలో వార్డులు, బ్యాలెట్ల అధారంగా టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. గదుల్లో పూర్తి భద్రతతోపాటు, బారికేడ్లు, సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్ల పేర్కొన్నారు.
లెక్కింపు కేంద్రం వద్ద ఐదెంచల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. కళాశాల ప్రాంగణమంతా పోలీసు భద్రతలో ఉంటున్నారు. వారి వెంట ఆర్డీఓ వేణుమాదవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, సీఐ వెంకటయ్య, తహసిల్దార్ కృష్ణయ్య, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


