కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి
సూర్యాపేట అర్బన్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తూ, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ ఆరోపించారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ నుంచి సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, ఎం సీపీఐయూ రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ఎల్ఐసీ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


