ఆరు దశాబ్దాల అపూర్వ సమ్మేళనం
హుజూర్నగర్ : అవును.. వాళ్లంతా కలిసి చదువుకున్నారు. వారికి ప్రస్తుతం దాదాపు 75–76 ఏళ్లు ఉంటాయి. ఆరు దశాబ్దాల తరువాత మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు, యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ వేడుకకు హుజూర్నగర్లోని కోట లక్ష్మీనరసింహరావు తోట వైదికయ్యింది. హుజూర్నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు (1963–64 హెచ్ఎస్సీ) కలిసి చదువుకుని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా 60 ఏళ్ల తరువాత బుధవారం ఒకే చోట కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు, కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు. ఆనాటి మధురస్మృతులు గుర్తుచేసుకుని ఉల్లాసంగా గడిపారు. అనంతరం పరస్పరం జ్ఞాపికలు బహూకరించుకొని సన్మానించుకున్నారు. అమెరికాలో స్థిరపడి ఇటీవల మాతృదేశానికి వచ్చిన పూర్వ విద్యార్థి కన్నెగుండ్ల రామ నర్సయ్య ప్రత్యేకంగా వచ్చి తోటి విద్యార్థులను కలుసుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముత్తినేని వెంకటేశ్వర్లు, వేముల వెంకటేశ్వర్లు, వక్కవంతుల కోటేశ్వర్రావు, కన్నగుండ్ల రామనర్సయ్య, ఎంబీ దేవదానం, డేవిడ్ రాజ, అలుగుబెల్లి లక్ష్మారెడ్డి, అలుగుబెల్లి కృష్ణారెడ్డి, కోట సూర్యప్రకాశరావు, ఆకుమడుపుల హనుమంతు, కుక్కడపు కాశయ్య, కర్నాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు.


