మేళ్లచెరువు జాతరకు రూ.కోటి మంజూరు
మేళ్లచెరువు,హుజూర్నగర్ : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా, మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించే జాతరకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చొరవతో ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరైనట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈనెల 14నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జాతర జరగనుంది. వివిధ అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. నిధులు మంజూరు పట్ల ఆలయ అధికారులు, జాతర కమిటీ సభ్యులు, నాయకులు మత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆరోగ్య జాగ్రత్తలుతప్పనిసరి
సూర్యాపేటటౌన్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని, తద్వారా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని డీఎంహెచ్ఓ వెంకటరమణ అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం అంశాలపై అవగాహన కల్పించారు. పొగాకు, పొగాకు ఉత్పత్తులు, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఉచిత వైద్యసేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమూల్య, వెంకన్న, సంజీవరెడ్డి, సంభాషివరావు, రవి, జ్యోతి, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా నృసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్య కల్యాణం వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లు నిర్వహించి కల్యాణ తంతు పూర్తి చేశారు. అనంతరం స్వామి, అమ్మవారిని గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అంతకుముందు సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. మూలవిరాట్ను అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం నిత్యహోమం, మహా నివేదన తదితర పర్వాలు జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయా చార్యులు పాల్గొన్నారు.
మేళ్లచెరువు జాతరకు రూ.కోటి మంజూరు


