ఫిబ్రవరి 5న కలెక్టరేట్ ముట్టడి
సూర్యాపేట : దళిత యువకుడు రాజేశ్ లాకప్ డెత్కు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజుమాదిగ అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ల రాజేశ్ లాకప్ డెత్కు నిరసనగా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. అందులో భాగంగా రేపు కోదాడలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న అన్ని మండల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25న మండల కేంద్రాల్లో మానవహారాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కర్ల రాజేశ్ లాకప్ డెత్ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, జిల్లా అధ్యక్షుడు వినయ్ బాబు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాజన్న, నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, కొమ్ము శేఖర్, ఎర్ర వీరస్వామి, బొజ్జ సైదులు, వెంకన్న, చింత సతీశ్ పాల్గొన్నారు.


