
అమలులోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీ, గ్రామపంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించినందున సోమవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం ఆయన కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న మూడు డివిజన్లలోని 23 మండలాల జెడ్పీటీసీలు, 235 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 486 గ్రామపంచాయతీలు, 4388 వార్డు సభ్యులకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 4,403 పోలింగ్ కేంద్రాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 1,272 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 541 పోలింగ్ ప్రాంతాలు, 6,94,815 మంది ఓటర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బందికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్టేజ్–1, స్టేజ్ –2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయగా, ఆర్ఓ, పీఓల శిక్షణ కార్యక్రమాలు మండలాల వారిగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి ప్రచురించే విషయంలో ప్రింటింగ్ ప్రెస్ లు పూర్తి వివరాలను ప్రదర్శించాలన్నారు. మీడియాలో వచ్చే చెల్లింపు వార్తలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, అలాంటి వార్తల వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో ఖర్చుగా చూపించనున్నట్లు చెప్పారు. మీటింగ్లు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎలాంటి ప్రభుత్వ పథకాల మంజూరు, గ్రౌండింగ్, ప్రారంభోత్సవాలు ఉండవని, జిల్లా కలెక్టర్ మొదలుకొని కిందిస్థాయి వరకు అందరూ ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తారని చెప్పారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈ అప్పారావు, డీపీఓ యాదగిరి, నల్లగొండ అసిస్టెంట్ డైరెక్టర్, సూర్యాపేట డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా సమాచార ఇంజనీర్ మల్లేశం, డిప్యూటీ సీఈఓ శిరీష, డివిజనల్ పంచాయతీ అధికారి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్