
కృష్ణా నదిలో విద్యార్థి గల్లంతు
నాగార్జునసాగర్: స్నేహితులతో కలిసి మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన హర్షవర్థన్, జ్ఞానేందర్, సుమన్, మణికంఠరెడ్డి, వెంకటేష్, చాణక్య (16)స్నేహితులు. వీరంతా వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరంతా కలిసి నాగార్జునసాగర్ను చూడటానికి మంగళవారం రెండు బైక్లపై వచ్చారు. అందరూ కలిసి నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఫొటోలు తీసుకున్నారు. అనంతరం కొత్త బ్రిడ్జి సమీపంలో చింతలపాలెం వెళ్లే దారి వెంట ఉన్న ఆంజనేయ పుష్కర ఘాట్లోకి దిగి స్నానాలు చేస్తుండగా.. చాణక్య నీటి ఉధృతికి కృష్ణా నదిలో కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు గజ ఈతగాళ్లతో కృష్ణా నది తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించలేదు.