అజొల్లాతో పశుగ్రాసం కొరతకు చెక్‌ ! | - | Sakshi
Sakshi News home page

అజొల్లాతో పశుగ్రాసం కొరతకు చెక్‌ !

Apr 8 2025 7:07 AM | Updated on Apr 8 2025 7:07 AM

అజొల్

అజొల్లాతో పశుగ్రాసం కొరతకు చెక్‌ !

నడిగూడెం: ప్రస్తుత వేసవిలో పశుగ్రాసం కొరతతో పాడి రైతులు ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్‌ పెట్టేందుకు అజొల్లా పెంపకమే సరైన పరిష్కారమని నడిగూడెం మండల పశువైద్యాధికారి డాక్టర్‌ అఖిల చెబుతున్నారు. ఆకుపచ్చ ఫెర్న్‌ జాతికి చెందిన ఈ నీటి మొక్క త్వరగా పెరుగుతుందని, ఇది పశుగ్రాసానికి ప్రత్యామ్నాయమని ఆమె పేర్కొన్నారు.

అజొల్లాతో లాభాలు ఇవీ..

అజొల్లా తిన్న పశువులకు పోషక విలువలు అందుతాయి. ఎండబెట్టిన అజొల్లా పొడిలో 25–35 శాతం వరకు మాంసకృత్తులు, 10–15 శాతం ఖనిజ లవణాలు, 7–10 శాతం అమినో ఆమ్లాలు, కెరోటిన్‌, బీ–12 విటమిన్లు ఉంటాయి. అజొల్లా లిగ్నైట్‌ తక్కువగా ఉండడటం వలన పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. ఒక కిలో అజొల్లా ఉత్పత్తికి 20–30 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రతి రోజు 1.5 నుంచి 2 కిలోల అజొల్లాను పశువులకు దాణాలో కలిపి తినిపించవచ్చు. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు. దీని వలన పాల దిగుబడి 15నుంచి 20 శాతం పెరుగుతుంది. పాలలో వెన్న శాతంలో పాటు ఎస్‌ఎన్‌ఎఫ్‌ పెరిగి ప్రతి లీటరు పాలకు 60 పైసలు నుంచి 150 పైసల వరకు అదనపు ఆదాయం పెరుగుతుంది.

ఇలా పెంచాలి..

సూటిగా సూర్యకాంతి పడని కొద్దిపాటి నీడ గల భూమి కలపును పూర్తిగా చదును చేసుకోవాలి. 10 సెం.మీ. లోతు వచ్చేలా గోతిని తవ్వాలి. అందులో చుట్టూ ఇటుకలను పేర్చాలి. ఇలా ఒక తొట్టిని 2.50 నుంచి 1.5 మీటర్ల సైజుల్లో నిర్మిస్తే అజొల్లా ఉత్పత్తి చేయవచ్చు. గోతి లోపల భూమిపై కలుపు మొక్కల వేర్లు రాకుండా ప్లాస్టిక్‌ సంచులు పరచాలి. దీనిపై 150 జీఎస్‌ఎం మందం ఉన్న ప్లాస్టిక్‌ షీటు వేయాలి. షీటు చివరలు ఇటుకలపై అంచువరకు వచ్చేలా పరచాలి. ఇందుకు 3.2 మీటర్ల సైజు గల ప్లాస్టిక్‌ షీటు ఉండాలి. షీటు కప్పిన తొలి లోతు 10 సెం.మీ. ఉండాలి. 30 నుంచి 35 కిలోల భూసారం గల మట్టిని జల్లెడ పట్టి, మెత్తని మట్టిని ప్లాస్టిక్‌ షీటుపై సమానంగా పరచాలి. ఒక చదరపు మీటరుకు 10 నుంచి 12 కిలోల పశువుల పేడను 10 లీటర్ల నీటిలో పలుచగా కలిపి, దానిలో 10–20 గ్రాముల సూపర్‌ పాస్పేట్‌ను కలిపి పోయాలి. ఈ తొట్టిలో 7–10 సెం.మీ. ఎత్తు ఉండేలా నీరు పోయాలి. బెడ్‌లోని మట్టి, నీటిని కలియతిప్పాలి. అజొల్లా త్వరతగతిన పెరిగి 7–10 రోజుల్లో నీటి తొట్టెను పూర్తిగా ఆక్రమిస్తుంది. 8వ రోజు నుంచి ప్రతిరోజు ఒక కిలో అజొల్లాను ఒక్కొక్క తొట్టి నుంచి తీసుకోవచ్చు. బెడ్‌ మీద చల్లిన ఒక కిలో అజొల్లా వారం రోజుల్లో 8–10 కిలోలు అజొల్లా ఉత్పత్తవుతుంది.

మేపేది ఇలా..

తొట్టి నుంచి తీసుకొచ్చిన అజొల్లా చదరపు సెంటీమీటరు వెడల్పు ఉన్న రంధ్రాలు గల ప్లాస్టిక్‌ ట్రేలో ఉంచాలి. దానిని సగం నీరు నింపిన బకెట్‌పై పెట్టి పైనుంచి నీరు పోయాలి. ట్రేలో పైన ఉన్న అజొల్లాను పశువులకు మేపాలి. ట్రేలోని రంధ్రాల ద్వారా చిన్న చిన్న అజొల్లా మొక్కలు బకెట్‌లోని నీళ్లలోకి వెళ్తాయి. ఈ నీటిని మరలా బెడ్‌లో పోయడం వలన అజొల్లాను తిరిగి పెంచవచ్చు. ప్రస్తుతం నడిగూడెం, కోదాడ మండలాలలో చుట్టుపక్కల వరి పొలాల్లో కూడా అజొల్లా కనిపిస్తోంది.

అజొల్లాతో పశుగ్రాసం కొరతకు చెక్‌ !1
1/1

అజొల్లాతో పశుగ్రాసం కొరతకు చెక్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement