శ్రీకాకుళం : జిల్లాలో కొన్ని సర్కారు బడుల ఆయుష్షు ఆగిపోతోంది. జిల్లాలో రానున్న విద్యా సంవత్సరంలో 267 పాఠశాలలు మూత పడనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఐదు కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నపక్షంలో ఆయా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు మూతపడతాయి. జిల్లాలోని 267 పాఠశాలల్లో సున్నా నుంచి ఐదు మంది విద్యార్థులు ఉండడంతో వీటి పరి స్థితి ప్రశ్నార్థకమైంది. ఇవే మూతపడితే 513 మంది ఉపాధ్యాయులు మిగులుగా తేలనున్నారు. గత విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులు లేక 12 పాఠశాలలు మూతపడ్డాయి. ఇవి మూతపడడం వల్ల, విద్యార్థుల సంఖ్యతో ఉపాధ్యాయుల నిష్పత్తిని లెక్క కట్టడం ద్వారా జిల్లాలో గతంలోనే 254 మంది స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారు. వీరిని అప్పట్లో మోడ ల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గాను, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గాను 196 మందిని నియమించారు. మిగిలిన 58 మంది డీఈఓ పూల్లో ఉన్నా రు. ప్రస్తుతం వీరితోపాటు మూతపడనున్న 267 పాఠశాలల నుంచి 513 మంది ఉపాధ్యాయులు మిగులుగా తేలనున్నారు.
ఐదు కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల విషయానికి వస్తే 248 ఫౌండేషన్ స్కూళ్లలో 89, 1,682 బేసిక్ ప్రైమరీ స్కూళ్లలో 135, 385 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో 15, 195 అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 23, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 295 హైస్కూళ్లలో నాలుగు, ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఉన్న బేసిక్ ప్లస్ హై స్కూల్ 89, ఒక హై స్కూల్లో ఐదు మంది కంటే తక్కువ విద్యార్థులు ఉండడంతో మూతపడనున్నాయి. మిగులు ఉపాధ్యాయుల విషయానికి వస్తే శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ల నుంచి 17 మంది, ఫౌండేషన్ స్కూళ్ల నుంచి 89 మంది, బేసిక్ ప్రైమరీ స్కూల్ నుంచి 135 మంది, మోడల్ ప్రైమరీ స్కూల్ నుంచి 150 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి 92 మంది, హై స్కూల్ నుంచి 28 మంది, బేసిక్ ప్లస్ హైస్కూళ్ల నుంచి ఇద్దరు టీచర్లు మిగులు కానున్నారు.
జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో గత ఏడాది తొమ్మిది రకాల పాఠశాలలు గా విభజిస్తూ చట్టం తీసుకొచ్చారు. టీచర్ పోస్టులు పెరుగాయని నమ్మబలికారు. అంతవరకు ఉన్న పాఠశాలలను తొమ్మిది రకాలుగా విభజించి ఆ యా పాఠశాలల స్టాఫ్ ప్యాట్రన్ ప్రాప్తికి ఉపాధ్యా య బదిలీలు హేతుబద్ధీకరణ కూడా చేపట్టారు. పంచాయతీ హెడ్ క్వార్టర్ గ్రామంలో ఉన్న పాఠశా ల లేదా ఒక పంచాయతీలో ఎక్కువ మంది విద్యార్థులు గల పాఠశాలను వయబుల్ పాఠశాలగా గుర్తించి దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల నుంచి మూడు, నా లు గు, ఐదు తరగతులను విలీనం చేశారు. 2025 మార్చి 31 తేదీ నాటికి పాఠశాలల్లో ఉన్న వి ద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకోవడంతో 2025 జూన్ 30 నాటికి చాలా బడులు పాఠశాలల స్థాయిని కోల్పోయాయి.
పడిపోయిన స్థాయి
జిల్లాలో సుమారు 60 పాఠశాలల వరకు 0 రోల్కు చేరుకున్నాయి. అంటే ఒక్క ఫౌండేషన్ స్కూళ్లలోనే 149 వరకు మూతకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు జిల్లాలో 17 చోట్ల అంగన్వాడీ కేంద్రాలతో కలుపుకొని ఒకటి రెండు తరగతులతో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేశారు. వాటి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరోవైపు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి కూడా నానాటికీ తీసికట్టుగా మారుతోంది. జిల్లాలో 385 పాఠశాలలను ఏర్పా టు చేయగా 385 పాఠశాలల్లోనూ నేడు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో అవన్నీ బేసిక్ ప్రైమరీ పాఠశాలలుగా స్థాయి పడిపోయాయి. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ 23 పాఠశాలలు వాటి స్థాయిని కోల్పోనున్నాయి.
జిల్లాలో విద్యార్థులు లేక మూతపడనున్న 267 పాఠశాలలు..?
267 పాఠశాలల్లోనూ ఐదుగురు కంటే తక్కువ విద్యార్థులు
513 మంది ఉపాధ్యాయులు మిగులు అయ్యే పరిస్థితి
గత విద్యా సంవత్సరంలోనే మూతపడిన 12 పాఠశాలలు
టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రతిసారి పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. 2001 ‘సార్వజనీన సార్వత్రిక విద్య’ పేరుతో ప్రైవేట్ పాఠశాలలకు ఆనాటి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది. ఆ రోజే ప్రభుత్వ పాఠశాలలపై దాడి ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం, విద్యార్థుల ప్రగతి నివేదికలు కార్పొరేట్ దిగ్గజం అజీమ్ ప్రేమ్జీకి సంబంధించిన ప్రథమ్ సంస్థ ద్వారా అధ్యయనం చేయించి ప్రతి విద్యా సంవత్సరం అసర్ రిపోర్ట్ ప్రకటిస్తూ వస్తోంది. దాని ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు లేవని, ఉపాధ్యాయులు బోధనా సామర్థ్యం కూడా అంతంత మాత్రమేనని చెప్పడమే.
– పేడాడ ప్రభాకరరావు, ఎస్టీయూ అధ్యక్షుడు


