జలుమూరు: మే తొమ్మిదిన అక్కురాడ పంచాయతీకి సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో సభా స్థలం, హెలీప్యాడ్ తదితర ప్రదేశాలను శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష బుధ వారం పరిశీలించారు. స్థల పరిశీలనతోపాటు అఽధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరవి తహసీల్దార్ జెన్ని రామారావుతో చర్చించారు. ఆమెతోపాటు స్థానిక అధికారులు పాల్గొన్నారు.
అక్రమంగా కంకర తరలింపు
సారవకోట: మండలంలోని అంగూరు గ్రామంలోని సర్వే నంబర్ 320లో గల కర్ర చెరువు నుంచి కంకర ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. 4.27 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువ పూర్తిగా కంకరతో నిండి ఉండటంతో స్థానిక జేసీబీ, ట్రాక్టర్ యజమానులు చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఎవరికి కంకర కావాలన్నా ఈ చెరువు నుంచి యంత్రాలతో త్రవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం భవనం నూతన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆ భవన పునాదులు కంకరతో నింపేందుకు వందలాది లోడ్లు ట్రాక్టర్లతో ఎలాంటి అనుమతి లేకుండా అంగూరు గ్రామం నుంచే తరలించారు. దీనిపై స్థానిక వీఆర్వో బి.ఆదినారాయణను వివరణ కోరగా తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
‘పనులు వేగవంతం చేయాలి’
హిరమండలం: గొట్టా బ్యారేజీ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని వంశధార ఎస్ఈ జి.రామచంద్రరావు అన్నారు. బుధవారం బ్యారేజీ వద్ద జరుగుతున్న గైడ్ బండ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్టా బ్యారేజ్ ఆధునికీకరణ పనులు నిమిత్తం ప్రభుత్వం రూ.16 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. అందులో భాగంగా జరుతున్న గైడ్ బండ్ పనులతో పాటు సీసీ యాప్రాన్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత ఇంజినీర్లకు సూచించారు.


