మందస: మందస మండలం భేతాళపురం రైతులు కార్గోఎయిర్ పోర్టుకు వ్యతిరేకిస్తూ భూ వివరాల జాబితాపై నిరసన తెలిపారు. ఈ సందర్భంలో మందస ఎమ్మార్వో కార్యాలయం, పలాస ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తమ ఆందోళన వ్యక్తం చేశారు. మందస ఎమ్మార్వో మిస్క శ్రీకాంత్కు మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో మడియా పురోషోత్తం, బత్తిన దేశయ్య, బొడ్డు శంకర్రావు, బత్తిని కృష్ణరావు, గార ఆనందరావు, బత్తిని ఉమాపతి, కీలు భీమారావు, ఇరోతు దేవరాజు, మడియా జగన్నాథం, ఆడతాల కూర్మారావు, మడియా ఋషి, బత్తిని మాధవరావు, బత్తిన మహేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సినీ నటుడు శివాజీ రాజాకు సత్కారం
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల పల్లిసారథిలో బుధవారం ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజాను ఏపీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కుమార్ నాయక్ సత్కరించారు. డొక్క కృష్ణారావు స్వీయ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చలన చిత్రంలో పలు సన్నివేశాలు ఉద్దాన ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం పల్లిసారథి ప్రాంతంలో చలన చిత్ర షూటింగ్ జరిగింది. చిత్రంలో నటించేందుకు శివాజీ రాజా వచ్చారు. కాగా హీరోగా, ప్రతి నాయకుడిగా సుమారు 500 పైచిలుకు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. పెళ్లి సందడి, కళ్లు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ ఉద్దాన ప్రాంతంలో పర్యటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సత్కా రం చేసిన వారిలో ఫెడరేషన్ సభ్యులు కొండల ప్రకాశ్, షేక్ రాజాబాబు, మేకప్ ఆర్టిస్ట్ ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.
జనసేన, టీడీపీ నాయకుల కుమ్ములాట
రణస్థలం: లావేరు మండలంలోని కొత్తరౌతుపేట గ్రామంలో కూటమి నాయకులు ఆల య నిర్మాణ స్థలంపై గొడవ పడ్డారు. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కొత్తరౌతు పేట గ్రామంలో కొంత స్థలంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించేందుకు టీడీపీ నాయకులు, గ్రామస్తులు పూనుకున్నారు. బుధవారం ఉదయం ఆ స్థలంలో కొలతలు వేస్తుండగా స్థానిక జనసేన నాయకుడు మా ఇంటికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా ఆలయ నిర్మాణం కట్టడం సరికాదని నిలదీశారు. ఇరు పక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని తోసుకున్నారు. దీంతో జనసేన నాయకుడు 100కి ఫోన్ చేయడంతో లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి వెళ్లి పరిస్థితిని గమనించి గొడవ పడవద్దని ఇరుపక్షాలకు సూచించారు. రెవెన్యూ అధికారులు వచ్చి కొలతలు వేసిన తర్వాత పనులు చేపట్టాలని చెప్పి వెనుదిరిగారు.


