శ్రీకాకుళం క్రైమ్ : ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వచ్చిన వినతులు చట్టపరిధిలో పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తిచెందేలా విచారణ జరిపి బాధితులకు న్యా యం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితుల నుంచి 61 వినతు లను ఎస్పీ స్వీకరించారు. బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
49 వేల యూరోలు ఇవ్వలేదు..
చర్యలు తీసుకోండంటూ వినతి..
బెల్జియం కంపెనీకి చెందిన రాజీవ్ బెహల్ తమను మోసగించారని ఎస్పీ గ్రీవెన్సులో బ్లూరాక్ మినరల్స్ కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కంపెనీ పేరుతో ఉన్న గ్రానైట్ స్మారక చిహ్నాలు, శ్లాబులను వివిధ రంగులతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నామని, బ్రెజిల్కు చెందిన శరణ్ ఇంటర్నేషనల్ ఎండీ రాజీవ్ బెహల్ ఇంటర్నెట్ మెయిళ్ల ద్వారా కావాలని అభ్యర్థించారన్నారు. దీంతో వివిధ తేదీల్లో 4 కంటైనర్ల గ్రానైట్ స్మారక చిహ్నాలను వారికి సరఫరా చే శామని, వాటి పత్రాలను సిండికేట్ బ్యాంకు, శ్రీకాకుళం ద్వారా కొనుగోలుదారుల బెల్జియం బ్యాంకుకు పంపించామన్నారు. బ్యాంకు నుంచి పత్రాలు పొందిన తర్వాత వారు రాటర్డామ్ పోర్టు నుంచి 4 కంటైనర్లను విడుదల చేసి స్టాకు విక్రయించారన్నారు. అయినప్పటికీ తమకు పంపాల్సిన 49,962.65 యూరోలు (మన కరెన్సీ అయితే రూ. 53,60,471.26 లు) వారి బ్యాంకు నుంచి పంపలేదన్నారు. దీంతో స్థానిక శ్రీకాకుళం కోర్టును ఆశ్రయించగా కంటైనర్లకు సంబంధించి అనుకూలంగా డిక్రీని ఇచ్చిందని, రాజీవ్ బెహల్పైన లుకౌట్ నోటీస్ జారీ చేసిందని, దాని ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని బ్లూరాక్స్ మినరల్స్ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ శాఖ కార్యాలయ ఉద్యోగులు తన విధుల్లో ఆటంకపర్చడమే కాకుండా దాడికి యత్నిస్తున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఖజానా శాఖ డీడీ రవికుమార్ ఎస్పీ గ్రీవెన్స్ను ఆశ్రయించారు. ఆదివారం రాత్రి ఇదే డీడీ రవికుమార్పై ఫిర్యాదు ఇచ్చేందుకు కార్యాలయ ఉద్యోగులు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. గతంలో కూడా ఇరువర్గాలు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు ఫిర్యాదులు ఇచ్చేందుకు వెళ్లడంతో సీఐ పైడపునాయుడు సుతిమెత్తగా హెచ్చరించి పంపించేశారు.


