మందస: ఆంధ్రా ఒడిశా సరిహద్దు సమీపంలోని కుల్లాడియా గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మందస మండలం చీపి గ్రామానికి చెందిన సవర ప్రదీప్ మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన సవర సూర్యనారాయణ, సవర ప్రదీప్లు ఒడిశాలోని జరడ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండంగా కుల్లాడియా గ్రామం వద్ద ఓ అడవి పంది హటాత్తుగా రావడంతో దాన్ని ఢీకొట్టారు. దీంతో బండిపై ఉన్న వీరిద్దరూ అదుపు తప్పి కింద పడిపోయారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా ఆ వాహనంపై క్షతగాత్రులను హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం తీసుకెళ్లారు. గురువారం ఉదయం 9 గంటలకు సవర ప్రదీప్ మరణించారు. స్థానిక ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


