హిరమండలం: వంశధార కుడి కాలువపై జరుగుతున్న ఎత్తిపోతల పథకం పనులను ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు. పనులు వేగవంతం కావాలని, సంబంధిత అధికారులకు సూచించారు. త్వరలో విద్యుత్ పనులు త్వరితగతిన చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. మెగా ఉద్దానం తాగునీటి పైపు వద్ద అడ్డంగా ఉన్న పనులు జాగ్రత్తగా ఇరు శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి చేసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ పనులు వంశధార కట్టడం విభాగం ఈఈ బి.రవీంద్ర బాబు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఆశలతకు పలు సూచనలు ఇచ్చారు. వంశధార రిజర్వాయర్ గట్టు పనులకు, మున్ముందు జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డంకులపై ఆరా తీశారు.
వేసవి దుక్కులే కీలకం
● సస్యరక్షణతోనే అధిక దిగుబడులు
● వ్యవసాయాధికారి సంధ్య
హిరమండలం: వ్యవసాయంలో రైతులు సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. విచక్షణారహితంగా పురుగుమందులు వాడితే ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. వేసవి దుక్కులతో రైతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని మండల వ్యవసాయాధికారి బి.సంధ్య చెబుతున్నారు.
పంట అవశేషాలు తొలగింపు
గత పంట తాలుకా అవశేషాలను పూర్తిగా తొలగిస్తే పురుగుల కొశస్థ దశలను నాశనం చేసిన తర్వాత సాగుచేసే పంటలకు పురుగులు ఆశించకుండా చేయవచ్చు. ముఖ్యంగా వరి పంటలో ప్రధానమైన కాండం తొలిచే పురుగు నియంత్రించవచ్చు.
ముందే దున్నాలి
వర్షాకాలం రాక ముందు భూమి మూడు దుక్కులు దున్నాలి. ఇలా చేస్తే తొలకరి వర్షాలకు నేల మెత్తబడి భూమిలోకి నీళ్లు ఇంకుతాయి. దుక్కులు లోతుగా అడ్డంగా, వాలుగా దున్నుకుంటే వర్షపు నీరు భూమిలోకి ఇంకి తేమను నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది. దుక్కి దున్ని భూమిని ఎండబెడితే కలుపు మొక్కలు నివారించవచ్చు. దుక్కులు దున్నే ముందు భూమిలో పశువుల పేడ, కంపోస్టు ఎరువులు చెరువు మట్టిని వేయాలి. వేసవిలో దుక్కి దున్నితే భూమి గుల్లగా మారుతుంది. దీంతో భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా తేమలో జీవించే సూక్ష్మజీవులు వానపాములు సంతతి వృద్ధి చెందుతుంది.


