పలాసలో వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి అక్రమ కంకర తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కాశీబుగ్గ రైల్వే ఫ్లై ఓవరు పేరు చెప్పి కొంతమంది గ్రావెల్ మాఫియా సభ్యులు ఈ కంకరను తవ్వి రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి అక్కడి యథేచ్ఛగా అమ్మకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా అధికారుల చర్యలు మాత్రం తూతూమంత్రంగా ఉంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా తర్లాకోట, కొత్తూరు, కోసంగిపురం, రాజగోపాలపురం, కంబిరిగాం గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి కంకరను కాశీబుగ్గలోని సెగిడి వీధిలో డంపు చేసి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు అమ్మకాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొండలు, చిన్న చిన్న మెట్టలు కనుమరుగవుతున్నాయి. పర్యావరణానికి పెనుముప్పుగా తయారవుతున్నాయి. కొండలను పిండి చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణులు సైతం జనారణ్యాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల ఓ జింక శాసనాం జాతీయ రహదారి వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. ఉద్దానం ప్రాంతంలో ఎలుగు బంట్లు సైతం గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. వాటికి ఆవాసాలుగా ఉన్న బెండి, పెద్ద కొండ, రట్టికొండలు సైతం గ్రావెల్ తవ్వకాలతో బోసిపోతున్నాయి. ఇప్పటి వరకు పలాసలో గ్రావెల్ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని జిల్లా మైనింగ్ అధికారులు చెబుతున్నా ఈ తవ్వకాలు మాత్రం ఇష్టానుసారంగా జరుగుతున్నాయి.


