● ముగ్గురు డిగ్రీ విద్యార్థులకు గాయాలు
నరసన్నపేట : తామరాపల్లి సమీపంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు గాయపడ్డారు. కోటబొమ్మాళి వైపు నుంచి విద్యార్థులతో నరసన్నపేట వస్తున్న ఆటోను మార్కెట్ కమిటీ వద్ద ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డిగ్రీ విద్యార్థులు కోటబొమ్మాళి మండలం సింహాద్రిపురానికి చెందిన రాజాపు సంతోష్, హర్ష, నిమ్మాడకు చెందిన శిమ్మ మాధురిలకు గాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీజల్ కోసం బస్సు రాంగ్రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను అదుపు తప్పి ఢీకొట్టిందని ఆటో డ్రైవర్ వీరాస్వామి తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే నరసన్నపేట ఎస్సై బి.గణేష్ ఘటనా స్థలానికి వెళ్లి సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తరలించి గాయపడ్డ విద్యార్థులకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


