బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని బ్యాంక్ ఉద్యోగుల ఐక్యవేదిక(యూఎఫ్బీయూ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం శ్రీకాకుళంలోని ఉమెన్స్ కళాశాల రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఉమెన్స్ బ్రాంచి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులు, యువ ఉద్యోగులపై దాడులు నివారించాలని కోరారు. ఐడీ బీఐ బ్యాంక్ అమ్మకాన్ని నిలిపివేయాలని, ఇన్య్సూరెన్స్ రంగంలో 100 శాతం ఎఫ్డీఐ పెంపును వెనక్కి తీసుకోవాలని, కార్పొరేట్లకు ఇచ్చిన బ్యాంక్ లోన్ల ఎన్పీఏలను రాబట్టాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీని వలన ప్రస్తుత ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలను కల్పించాల్సిందేనని నినదించారు. సమ్మెలో యూఎఫ్బీ యూ ప్రతినిధులు జి.కరుణ, రామశర్మ, శ్రావణి, రాంప్రసాద్, గిరిప్రసాద్, సూర్య, ఉపేంద్ర, గణేష్, ప్రసాద్, వాసు తదితరులు పాల్గొన్నారు.


